తెలుగురాష్ట్రాల్లో తగ్గిపోతున్న ప్రభుత్వ స్కూళ్లు-పెరుగుతున్న టీచర్లు..! కేంద్రం షాకింగ్ ..!
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల తాజా పరిస్ధితిపై పార్లమెంట్ లో ఇవాళ కేంద్రం వెల్లడించిన గణాంకాలు షాకింగ్ గా ఉన్నాయి. కాంగ్రెస్ ఎంపీలు కార్తీ చిదంబరం, అమరీందర్ సింగ్ రాజా వారింగ్ లోక్సభలో అడిగిన సమాధానంగా కేంద్రం ఈ డేటాను విడుదల చేసింది. ఇందులో గత ఆరు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సంఖ్య భారీగా తగ్గిందని కేంద్రం వెల్లడించింది.
దేశంలో మారుతున్న పరిస్ధితుల్లో విద్యార్ధులు, తల్లితండ్రులు ప్రభుత్వ పాఠశాలల్ని కాదని ప్రైవేటు స్కూళ్లవైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్ వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల వివరాలను విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ వెల్లడించారు. దీని ప్రకారం గత ఆరేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు వరుసగా మూత పడుతున్నట్లు తెలుస్తోంది.

ఏపీ, తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువగా మూతపడినట్లు కేంద్రం ప్రకటించిన డేటా తెలిపింది. విద్యామంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం 2019-20లో దేశంలో 10.32 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. 2024-25లో అవి 10.13 లక్షలకు పడిపోయాయని వెల్లడించారు. ఆసక్తికరంగా ఈ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల సంఖ్య 2022-23లో 1.26 లక్షల నుండి 2024-25లో 1.44 లక్షలకు పెరిగిందని వెల్లడించింది.

అయితే ఈ తగ్గింపులో మూసివేతలు ఎన్ని ఉన్నాయి, విలీనాలు ఎన్ని ఉన్నాయి, వాటి వెనుక కారణాల్ని మాత్రం ఆయన బయటపెట్టలేదు. అయితే గత 3 సంవత్సరాలలో 10 కంటే తక్కువ లేదా సున్నా విద్యార్థుల నమోదు ఉన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్యలో స్థిరమైన పెరుగుదల ఉన్నట్లు తేలింది. 2022-23లో 10 కంటే తక్కువ లేదా సున్నా విద్యార్థుల నమోదు ఉన్న 52,300 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, 2024-25లో ఈ సంఖ్య 65,000 కంటే ఎక్కువకు పెరిగిందని డేటా చెబుతోంది.












Click it and Unblock the Notifications