ఇండియన్ ఎయిర్ఫోర్స్కు 56 కొత్త రవాణా విమానాలు-రూ.20వేల కోట్ల డీల్-కేంద్రం ఆమోదం
ఇండియన్ ఎయిర్ఫోర్స్కు కొత్త రవాణా విమానాలు సమకూర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్బస్ డిఫెన్స్,స్పేస్ ఆఫ్ స్పెయిన్ కంపెనీలతో సీ295MW మోడల్కి చెందిన 56 విమానాలు కొనుగోలు ఒప్పందానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒప్పందంలో టాటా కన్సార్షియం మాన్యుఫాక్చరింగ్ సంస్థను భాగస్వామిగా చేర్చారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వివరాల ప్రకారం... ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.20వేల కోట్లు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన 48 నెలల్లోగా స్పేస్ ఆఫ్ స్పెయిన్ నుంచి భారత్కు 16 విమానాలు అందుతాయి. మిగతా 40 విమానాలను భారత్లోనే టాటా కన్సార్షియం మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో పదేళ్ల కాలంలో తయారుచేస్తారు. భారత రక్షణ రంగంలో ఉపయోగించే ఎయిర్క్రాఫ్ట్స్ తయారీని ఓ ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం ఇదే తొలిసారి.
సీ295MW బరువు సుమారు 5 నుంచి 10 టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీతో తయారుచేసే ఈ విమానాల ద్వారా దళాల పారా డ్రాపింగ్,కార్గో,యుద్ధప్రాతిపదికన ప్రతిస్పందన చర్యలు చేపట్టవచ్చు.
Recommended Video
ప్రస్తుతం ఎయిర్ఫోర్స్లో ఉపయోగిస్తున్న ఏవ్రో రవాణా విమానాలు 1960ల కాలం నాటివి. ఇది గంటకు 452కి.మీ వేగంతో ప్రయాణించగలదు. దీని సామర్థ్యం 6 టన్నులు. ప్రస్తుతం ఎయిర్బస్,స్పేస్ ఆఫ్ స్పెయిన్ నుంచి కొనుగోలు చేయనున్న సీ295MW విమానాలు దీని కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. స్వదేశీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్తో వీటిని తయారుచేయనున్నారు. దీని ద్వారా ఏరోస్పేస్ ఎకో సిస్టమ్లో నైపుణ్యం కలిగిన 600 మందికి,పరోక్షంగా 3వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఏవియేషన్ ఇండస్ట్రీలో స్వదేశీ ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.