ధర్డ్ వేవ్ భయాలు- అగస్టు 31 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
భారత్ ను కరోనా మూడో వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. రెండో వేవ్ లో భారీ సంఖ్యలో మరణాలు, కేసులు నమోదైన నేపథ్యంలో మూడో వేవ్ పై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గిపోయినా ఇంకా ఆంక్షలు కొనసాగించాల్సిందేనని తాజాగా స్పష్టం చేసింది. ఆగస్టు 31 వరకూ తమ మార్గదర్శకాలు పాటించాల్సిందేనని ఆదేశాలు పంపింది.
దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా ధర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపైనా నిషేధం కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. విదేశీ విమానాలను అనుమతిస్తే అక్కడి వేరియంట్లు దేశంలోకి ప్రవేశిస్తాయని భయపడుతున్న కేంద్రం ఆగస్టు 31 వరకూ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించింది. ఈ సమయంలో దేశంలోకి విమానాలను అనుమతించడం కానీ, విదేశాలకు పంపడం కానీ జరగదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం కేంద్రం గతంలో భారత్ తో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న 28 దేశాల నుంచి మాత్రమే విమానాలను అనుమతిస్తోంది. అలాగే అవే దేశాలకు భారత్ నుంచి విమానాలను పంపుతోంది. గతేడాది మార్చిలో విమానాల రాకపోకలపై నిషేధం విధించాక ఈ విధానం మాత్రమే అమల్లో ఉంది. ప్రస్తుతం గతంలో విధించిన నిషేధాన్ని ఆగస్టు 31 వరకూ పొడిగించడంతో ఈ విధానం అప్పటి వరకూ అమలు కానుంది. అయితే ఈ సమయంలో కార్గో విమాన సేవల్ని మాత్రం అనుమతిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. విదేశీ వాణిజ్యంపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో కరోనా మూడో వేవ్ వస్తుందన్న భయాల నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు అర్దమవుతోంది.