కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచివున్న వేళ.. ఆక్సిజన్ దిగుమతులపై ఫోకస్: ట్యాక్స్ గడువు పెంపు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దేశంలో ఇంకా తగ్గట్లేదు. పైగా క్రమంగా పెరుగుతోంది. నాలుగైదు రోజులుగా 40 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతోన్నాయి. ఇందులో కేరళ, మహారాష్ట్ర వాటా అధికంగా ఉంటోంది. ప్రత్యేకించి- కేరళ. ఈ రాష్ట్రంలో రోజూ 30 వేలకు పైగానే రోజువారీ కేసులు వెలుగులోకి వస్తోన్నాయి. థర్డ్ వేవ్ ముప్పు కేరళతోనే ఆరంభమైందా? అనే అనుమానాలను ప్రజల్లో రేకెత్తించేలా చేస్తోంది. మరణాలు కాస్త నియంత్రణలోనే ఉన్నప్పటికీ.. పూర్తిగా తగ్గని పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి.
దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని చోట్లా సాధారణ సంఖ్యలో కేసులు నమోదవుతోన్నప్పటికీ- రెండు, మూడు రాష్ట్రాల్లో మాత్రం అసాధారణంగా ఉంటోంది కరోనా తీవ్రత. కేరళ తరువాత మహారాష్ట్ర ఆందోళనకర స్థాయిలో రోజువారీ కేసుల సంఖ్యను నమోదు చేస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్ కొంత ఆందోళనను కలిగిస్తోన్నప్పటికీ.. దాని పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటోన్నాయి. నియంత్రణా చర్యలను తీసుకుంటోన్నాయి. ఎప్పటికప్పుడు తాజా మార్గదర్శకాలను జారీ చేస్తూ వస్తోన్నాయి.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 42,909 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 380 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. 34,763 మంది కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 97.53 శాతంగా నమోదైంది. ఇప్పటిదాకా 3,19,23,405 మంది కోలుకున్నారు. 4,38,210 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,76,324గా నమోదైంది.

దీన్ని బట్టి చూస్తోంటే.. కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోందనేది స్పష్టమైతోంది. థర్డ్ వేవ్ కూడా దీనికి తోడైతే.. పరిస్థితులు మళ్లీ తీవ్ర సంక్షోభానికి దారి తీస్తాయనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. అదే సమయంలో- ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, ఐసీయూ పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల డిమాండ్ నెలకొనే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
సెకెండ్ వేవ్ సంక్షోభ సమయంలో ఇక్కడ నెలకొన్న ఆక్సిజన్లు, ఐసీయూ పరికరాలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కొరతను అధిగమించడానికి విదేశాలు సహకరించాయి. పెద్ద ఎత్తున వాటిని భారత్కు పంపించాయి. పొరుగు దేశాలు విరాళంగా అందించిన ఆక్సిజన్, ఇతర ఐసీయూ పరికరాలపై కేంద్ర ప్రభుత్వం హెల్త్ సెస్, ఎక్సైజ్ డ్యూటీని విధించింది. సంక్షోభ సమయంలో విరాళంగా విదేశాలు అందిస్తోన్న ఆక్సిజన్, దాని అనుబంధ పరికరాలపై సెస్, ట్యాక్స విధించడాన్ని దేశ ప్రజల తప్పు పట్టారు.
దీనితో అప్పటికప్పుడు నిర్మల సీతారామన్ సారథ్యంలోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. వాటిపై హెల్త్ సెస్, ఎక్సైజ్ డ్యూటీని మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు గడువు మంగళవారం నాటితో ముగియాల్సి ఉంది. దేశంలో వాటి కొరతను దృష్టిలో ఉంచుకోవడం, రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతోండటాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం- ఈ మినహాయింపును మరో నెల రోజుల పాటు పొడిగించింది. సెప్టెంబర్ 30వ తేదీకి తుది గడువును నిర్ధారించింది.












Click it and Unblock the Notifications