Bharat Atta: మోడీ సర్కారు గుడ్న్యూస్; పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు
న్యూఢిల్లీ: దీపావళి పండగ నేపథ్యంలో సామాన్యులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త అందించింది. గోధుమ పిండిని తక్కువ ధరకే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ గోధుమ పిండి (Bharat Atta) విక్రయాలను ప్రారంభించింది. కిలో గోధుమ పిండి ప్యాకెట్ను రూ. 27.50కే దేశ వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. భారత్ గోధుమ పిండి విక్రయాలను కేంద్ర ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ఢిల్లీలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. రైతులు, వినియోగదారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. దేశంలో ఆహార పదార్థాల ధరలు పెరిగిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం వాటిని సేకరించి సబ్సిడీలో ప్రజలకు అందజేస్తోంది. టమాటా ధరలు పెరిగిన సమయంలోనూ వాటి ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

పప్పు ధాన్యాలను అందుబాటు ధరల్లో ఉంచడం కోసం భారత్ దాల్ ను పరిచేయమని కేంద్రమంత్రి తెలిపారు. ఉల్లి ధరల విషయంలోనూ అదే విధంగా చర్యలు చేపడతున్నామని పీయూష్ గోయల్ వివరించారు. కాగా, నేషనల్ కో-ఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన్, నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ద్వారా దేశంలోని రెండు వేల దుకాణాలకు 800 వాహనాలు భారత్ దాల్, గోధుమ పిండి, ఉల్లిపాయలను సరపరా చేస్తాయని కేంద్ర పౌర సరఫరాల శాఖ పేర్కొంది.
కాగా, భారత్ గోధుమ పిండి కోసం భారత ఆహార సంస్థ(FCI) నుంచి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కేజీ రూ. 21.5కే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏజెన్సీలకు కేటాయించారు. అక్కడ తయారైన పిండిని దేశ వ్యాప్తంగా కేజీ రూ. 27.50కే విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ గోధుమ పిండిని ప్రయోగాత్మకంగా కో-ఆపరేటివ్ అవుట్ లెట్లలో కేజీ రూ. 29.50కే కేంద్ర ప్రభుత్వం విక్రయించింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్కెట్లలో నాన్ బ్రాండెడ్ గోధుమ పిండి కిలో ధర రూ. 36కు విక్రయిస్తున్నారు. ఏటా ధర రూ. 5.6 శాతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు పండగ సమయంలో ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ గోధుమ పిండిని ప్రవేశపెట్టింది. మరికొన్ని నిత్యావసరాలను కూడా తక్కువ ధరకే అందించే ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications