ఆ ఇద్దరికే కాదు, వీరికీ స్పెషల్ ప్రయార్టీ - మారుతున్న లెక్కలు..!!
Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్ వైపు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. బడ్జెట్ లో రాష్ట్రాల వారీగా కేటాయింపులు.. ప్రాధాన్యత రంగాల పైన అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. మూడో సారి అధికారంలోకి వచ్చిన తరువాత మిత్రపక్షాలకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. నేటి బడ్జెట్ లోనూ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలతో పాటుగా ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయంగా పక్కా లెక్కలతో ముందుకు వెళ్తే మోదీ - షా ఈ దిశగానే అడుగులు వేస్తారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
కేంద్రం కేటాయింపులు
కేంద్రం కొంత కాలంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఏపీలో కీలక ప్రాజెక్టు లకు నిధులు కేటాయించింది. భవిష్యత్ మద్దతు పైన హామీ ఇచ్చింది. ప్రస్తుత బడ్జెట్ లోనూ ఏపీకి ప్రాధాన్యత ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో మరో కీలక భాగస్వామి నితీశ్ ప్రభుత్వం ఉన్న బీహార్ కు ఈ సారి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. మిత్రపక్షాలతో పాటుగా
ఈనెలలో ఎన్నికలు జరగనున్న ఢిల్లీకి ప్రాధాన్యత ఇచ్చేలా ప్రకటనలు ఉంటాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వీటితో పాటుగా ఈ ఏడాది.. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగే రాష్ట్రాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది.

వ్యూహాత్మక అడుగులు
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా ఇదే ఏడాది కీలకమైన బీహార్ లోనూ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారం కోసం బీజేపీ ఈ బడ్జెట్ లో వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉంది. అదే విధంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు ఉండవవచ్చనే చర్చ జరుగు తోంది. బీహార్కు తప్పనిసరిగా కేటాయింపులు అధికంగా ఉండే ఛాన్స్ ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రియల్- మే మధ్యలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ రాష్ట్రాలకు ప్రాధాన్యత
ఈ రాష్ట్రాల్లో అస్సాం మాత్రమే ఎన్డీఏ అధికారంలో ఉంది. జమిలికి సిద్దం అవుతున్న వేళ ఈ ప్రధాన రాష్ట్రాల్లో పాగా వేయటం బీజేపీకి బిగ్ టాస్క్ గా మారుతోంది. దీంతో, బడ్జెట్ లోనే ఈ రాష్ట్రాలకు ప్రాధాన్యత పెంచుతూ...రాజకీయంగా పట్టు పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. దీంతో, కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు సంతృప్తికర స్థాయిలో కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ అంచనాలతో ఈ రోజు పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్ పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications