రాత్రుళ్లు మెలుకువతో ఉండాలంటే.. అశ్లీల నృత్యాలే సరి : కేంద్రమంత్రి సంచలనం
మధ్యప్రదేశ్ : కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఫగన్ కులస్తే చేసిన పలు సంచలన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగుచూశాయి. అశ్లీల నృత్యాలను ప్రోత్సహించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. మధ్యప్రదేశ్ లో నయిన్ పూర్ జిల్లాలోని పిప్రియో అనే గ్రామంలో ఏర్పాటు చేసిన గోండు రాజుల సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఫగన్ కులస్తే. గోండు రాజులైన శంకర్ షా, రఘునాథ్ షా సంస్మరణార్థం రాత్రి సమయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంస్మరణ సభ సందర్బంగా.. ఛత్తీస్ గఢ్ నుంచి కొంతమంది డ్యాన్సర్లను రప్పించి మరీ అక్కడి వారు అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు.

ఈ అశ్లీల నృత్యాలను ఆసక్తిగా తిలకించిన కేంద్రమంత్రి ఫగన్ కులస్తే.. రాత్రుళ్లు ప్రజలు నిద్రపోకుండా మెలకువగా ఉండాలంటే అశ్లీల నృత్యాలు అవసరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అశ్లీల నృత్యాలు గిరిజన సంస్కృతిలో భాగమని చెప్పుకొచ్చిన ఆయన.. ప్రజలంతా వీటిని బాగా ఇష్టపడుతున్నారని అన్నారు. ఇదే కార్యక్రమంలో కేంద్రమంత్రితో కలిసి పలువురు బీజేపీ నేతలు కూడా పాల్గొనడం గమనార్హం. కాగా, కేంద్రమంత్రి చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారం రేపేవిగా మారాయి.












Click it and Unblock the Notifications