నెహ్రూ ఒక్క కాశ్మీర్ని.., రాష్ట్రాన్నేవిభజించండి: వెంకయ్య
హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలోని 550కి పైగా సంస్థానాలను సమర్థవంతంగా విలీనం చేస్తే, జవహర్ లాల్ నెహ్రూ ఒక్క కాశ్మీర్ సమస్యను పరిష్కరించలేకపోయారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆదివారం ఆరోపించారు. గుజరాత్లో ఏర్పాటు చేయనున్న పటేల్ విగ్రహానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల కో-ఆర్డినేటర్లకు ఆదివారమిక్కడ నిర్వహించిన వర్క్షాప్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాష్ట్రాన్ని ప్రాంతాలుగా విభజించాలని అడిగితే, కాంగ్రెస్ నేతలు ప్రజలను విభజిస్తున్నారని ధ్వజమెత్తారు. తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతు న్నారని, శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. శాంతి, స్నేహం, సౌభ్రాతృత్వం మధ్య విభజించాల్సింది పోయి, ఇష్టమొచ్చిన రీతిలో విభజన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషుల మధ్య విభజన తీసుకురావడం అన్యాయమని, విభజన అనేది శాంతి, స్నేహం, సౌభ్రాతృత్వం మధ్య జరగాలని, లేకపోతే జాతీయ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంది.

మత ప్రాతిపదికన తమకు ప్రత్యేక దేశం కావాలని పాకిస్థానీలు వెళ్లిపోయారని, ఉన్నవారు ఇక్కడే ఉండిపోయారని, ఇక్కడున్న వారందరూ భారతీయులేనన్నారు. వారికి దేశంలో సమాన హక్కులు ఉన్నాయని చెప్పారు. దేశాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ అభిమతమన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని బిజెపి నమ్ముతోందని, ఒక ప్రాంతాన్ని విడగొట్టడమంటే మరో ప్రాంతాన్ని విస్మరించడం కాదన్నారు.
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అనేక సంస్థానాలను విలీనం చేసి దేశ సమైక్యతను చాటారని కొనియాడారు. పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్న కొంతమంది కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. దేశంలో గల్లీ గల్లీలో విగ్రహాలు వెలుస్తున్నాయని, రౌడీలకు కూడా విగ్రహాలు పెడుతున్నారని, దేశ సమైక్యత కోసం పాటుపడిన పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.
ఒక చారిత్రక పొర పాటు కారణంగా పటేల్ ప్రధానమంత్రి కాలేకపోయారని, ఆ పొరపాటు తెలుసుకొన్న శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ను ఏర్పాటు చేశారన్నారు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, నెహ్రూ స్వాతంత్య్ర సమరయోధులే గానీ, కాంగ్రెస్ పార్టీ వారు కాదన్నారు. దేశానికి కావాల్సింది పటేల్ లౌకికవాదమే తప్ప ఓటు బ్యాంకు లౌకికవాదం కాదన్నారు.












Click it and Unblock the Notifications