అమర్ జవాన్ జ్యోతిపై కేంద్రం క్లారిటీ- ఆర్పేయలేదు-యుద్ధవీరుల స్మారకంలో కలిపేస్తున్నామంతే
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న శాశ్వత జ్వాల ఆర్పివేయాలనే నిర్ణయంపై విపక్షాల విమర్శల నేపత్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు దీనిపై స్పందించాయి. ఏడు దశాబ్దాలుగా జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని నిర్మించకుండా వదిలేసిన వారు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నాయి. అమరవీరులకు శాశ్వత, సముచిత నివాళులర్పిస్తున్నప్పుడు ఈ విమర్శలేంటని ప్రశ్నించాయి. అమర్ జవాన్ జ్యోతి జ్వాల ఆర్పేస్తున్నారంటూ వస్తున్నవి పుకార్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అమర్ జవాన్ జ్యోతి జ్వాల ఆరిపోలేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీనిని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో విలీనం చేయబోతున్నట్లు తెలిపింది. ఇండియా గేట్ పై ఇన్నాళ్లుగా 1971 నుంచి జ్యోతి వెలుగుతున్నా.. అక్కడ యుద్ధ వీరుల పేర్లు లిఖించకపోవడంపైనా కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఇండియా గేట్పై రాసిన పేర్లు మొదటి ప్రపంచ యుద్ధం, ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటిష్ వారి కోసం పోరాడిన కొంతమంది అమరవీరులను మాత్రమే సూచిస్తా.ని, అందువల్ల మన వలస చరిత్రకు అవి చిహ్నంగా ఉన్నాయని కేంద్రం తెలిపింది.
గణతంత్ర దినోత్సవానికి ముందు, ఇండియా గేట్ వద్ద ఉన్న శాశ్వతమైన జ్వాల 50 సంవత్సరాల తర్వాత ఆరిపోతుందని, దాని పక్కనే ఉన్న జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో జ్వాలతో కలిసిపోతుందని కేంద్రం తెలిపింది. అమర్ జవాన్ జ్యోతి, లేదా శాశ్వతమైన జ్వాల, 1971లో ఇండో-పాక్ యుద్ధంలో మరణించిన సైనికుల స్మారకార్థం 1972లో ఇండియా గేట్ ఆర్చ్ కింద నిర్మించారు. దాని పైన ఒక విలోమ బయోనెట్, సైనికుడి హెల్మెట్ ఉంది, శాశ్వతమైన జ్వాల మండుతూ ఉంటుంది. దీనిని జనవరి 26, 1972న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు.