పాక్ అన్నంత పనీ చేసిందా? భారత ఆర్మీ భారీగా నష్టపోయిందా?: కేంద్రం ఏం చెబుతోంది
India Pakistan War: అంచనాలకు తగ్గట్టే- పాకిస్తాన్పై భారత్ యుద్ధానికి దిగింది. వైమానిక దాడులు సాగించింది. బుధవారం తెల్లవారు జామున ఈ దాడులు చేపట్టింది. శతృదేశం ఊపిరి సలపనివ్వలేదు భారత్. ఏకధాటిగా మిస్సైళ్లను సంధించింది. ఈ మిషన్కు భారత్ పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారమే ఈ యుద్ధం. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నా ఉగ్రవాదులు. ఈ ఘాతుకానికి పాకిస్తాన్ కారణమంటూ మొదటి నుంచీ భారత్ వాదిస్తూ వచ్చింది. యుద్ధ సన్నాహకాలనూ చేపట్టింది.

తాజాగా ప్రత్యక్ష యుద్ధానికి దిగింది భారత్. తెల్లవారు జామున 2 గంటల సమయంలో చిక్కటి చీకటిని చీల్చుకుంటూ తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి.
దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ భూభాగంపై ఉంటూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తోన్న ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఈ వైమానిక దాడులను చేపట్టింది. ఉగ్రవాదాన్ని ఉద్దేశపూరకంగా పెంచి పోషిస్తూ వచ్చిన పాకిస్తాన్ పీచమణచాలనేదే ఈ దాడుల ముఖ్య ఉద్దేశం.
ఈ దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. పాకిస్తాన్ తక్షణమే ఎదురుదాడికి దిగిందని, భారత ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ ధ్వంసమైందని విస్తృతంగా ప్రచారం సాగింది. చెప్పినట్టే ఈ ఎదురు దాడులు సాగాయని కథనాలు, కొన్ని రకాల స్క్రీన్షాట్లు పోస్ట్ అయ్యాయి.
పాకిస్తాన్ భూభాగంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ప్రతీకారం తీర్చుకుంటామని అంతకుముందే ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. భారత్కు దీటైన జవాబిస్తామనీ అన్నారు. పాక్ రక్షణ మంత్రి సైతం దీనిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. భారత్పై పూర్తి బలంతో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
అదే సమయంలో భారత ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ ధ్వంసమైందనే కథనాలు సోషల్ మీడియాలో పోస్ట్ కావడం ఆందోళనకు దారి తీసింది. దీని తీవ్రతను గమనించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వార్తలను తోసిపుచ్చింది. పాకిస్తాన్ ఎటువంటి ఎదురుదాడికి దిగలేదని స్పష్టత ఇచ్చింది.
ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది. భారత బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని పాకిస్తాన్ నాశనం చేసిందని సోషల్ మీడియా పోస్ట్లు నిరాధారమని పేర్కొంది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ సమాచారం సర్కులేట్ అవుతోందని వివరించింది. దీన్ని షేర్ చేయవద్దని, ఖచ్చితమైన సమాచారం కోసం కేంద్రం ప్రభుత్వం/అధికార వర్గాలపై మాత్రమే ఆధారపడాలని సూచించింది.












Click it and Unblock the Notifications