ఉరితోనే సులభంగా శిక్ష అమలు: సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడవిట్
న్యూఢిల్లీ: ఉరి శిక్షను రద్దు చేసి ఇతర మార్గాల్లో శిక్షను అమలు చేయాలనే విషయమై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టుకు మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ను సమర్పించింది. ఉరి శిక్షే ఇతర పద్దతుల కంటే మేలని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఉరిశిక్షకు బదులుగా ఇతర పద్దతుల్లో శిక్షను అమలు చేయాలని అడ్వొకేట్ రోషి మల్హోత్రా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు ఈ చట్టంలో సవరణలు కూడ తీసుకురావాలని ఆయన కోరారు.
ఉరిశిక్ష అమలు చేయడం ద్వారా వ్యక్తి స్వేచ్చను , హక్కులను హరించడమేనని అడ్వకేట్ రోషి మల్లోహత్రా సుప్రీంకోర్టులో వాదించారు. మంగళవారం నాడు ఈ విషయమై కోర్టులో వాదనలు జరిగాయి.
ఈ విషయమై కేంద్రం కూడ మంగళవారం నాడు అఫిడవిట్ను దాఖలు చేసింది. విషపు ఇంజక్షన్లు, తుపాకితో చంపడం కంటే ఉరిశిక్ష ద్వారా చంపడమే సులువైన పద్దతిగా ఉంటుందని కేంద్రం అభిప్రాయపడింది.
అంతేకాదు శిక్షను త్వరితగతిన అమలు చేసేందుకు వీలయ్యే అవకాశం ఉందని కూడ కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ప్రకటించింది. ఈ అఫిడవిట్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.