ప్రభుత్వం ఆధీనంలోకి దేవాలయాల బంగారం: తేల్చేసిన కేంద్రం
కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆలయాల బంగారానికి సంబంధించి సోషల్ మీడియా, కొన్ని ప్రధాన మీడియాల్లో అనేక రకాల ఊహాగానాలు, చర్చలు సాగుతున్నాయి. దేశంలోని సుసంపన్న దేవాలయాల బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోందని వదంతులు వ్యాపించాయి. ఈ చర్చలు, వాదనలపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ఓ స్పష్టత ఇచ్చింది.
ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వార్తలన్నింటినీ పూర్తిగా ఖండించింది. దేశంలోని ఏ దేవాలయ ట్రస్ట్ లేదా మత సంస్థ కలిగి ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకోవడానికి గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ ను ప్రవేశపెట్టే ప్రణాళిక ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ వాదనలు పూర్తిగా అవాస్తవం, తప్పుదోవ పట్టించేవి, నిరాధారమైనవని తేల్చిచెప్పింది.

ఏడాది పాటు బంగారాన్ని కొనొద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన తర్వాత.. ఈ టెంపుల్ గోల్డ్ మోనిటైజేషన్ వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఇంటర్నెట్, వాట్సాప్లలో వేగంగా వైరల్ అయ్యాయి. దేశంలోని సంపన్న దేవాలయాల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొత్త పథకాన్ని తీసుకువస్తుందనేది వీటి సారాంశం. టెంపుల్ గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ ను అమలు చేయబోతోందని, దేవాలయాల బంగారానికి బదులుగా గోల్డ్ బాండ్లను జారీ చేసే ప్రతిపాదనకు ఆమోదం లభించిందని కూడా వదంతులు వ్యాపించాయి.
అక్కడితో ఆగలేదు. ఆలయాల శిఖరాలు, గోపురాలు, ద్వారాలు లేదా ఇతర నిర్మాణాలపై ఉన్న బంగారు పూతను కూడా ప్రభుత్వం తన సొంత బంగారు నిల్వలుగా ప్రకటించబోతోందనీ ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ వైరల్ వాదనలతో సామాన్య ప్రజలు, భక్తుల మధ్య గందరగోళం పెరుగుతున్న దృష్ట్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ రాతపూర్వక వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఆలయ ట్రస్టులు లేదా ఏదైనా మత సంస్థల వద్ద ఉన్న బంగారం కోసం నగదీకరణ పథకాన్ని ప్రారంభించనున్నారనే ఊహాగానాలు, వదంతులు పూర్తిగా నిరాధారమైనవని తోసిపుచ్చింది.
అదేవిధంగా, ఆలయ శిఖరాలు, ద్వారాలు లేదా నిర్మాణాలపై ఉన్న బంగారు ప్లేట్లను 'వ్యూహాత్మక బంగారు నిల్వ'గా పరిగణిస్తున్నారనే వాదనలు కూడా కల్పితం, అవాస్తవమని తేల్చి చెప్పింది. ఇటువంటి అనధికార సమాచారాన్ని నమ్మవద్దని, ఇతరులతో పంచుకోవద్దని ప్రభుత్వం దేశ పౌరులకు విజ్ఞప్తి చేసింది. ఇటువంటి తప్పుడు వార్తలు సమాజంలో అనవసరమైన గందరగోళాన్ని, అశాంతిని సృష్టిస్తాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications