కేంద్రీయ విద్యాలయంలో చెలరేగిన వివాదంతో మాకు సంబంధం లేదు: సుప్రీంకు కేంద్రం వివరణ
ఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఉదయంవేళ అసెంబ్లీలో పిల్లల చేత సంస్కృతం, హిందీ పద్యాలు పాడించడం వివాదంగా మారుతోంది. ఈ విషయంపై కేంద్రం స్పందించాలని కోరగా ఈ వివాదంలో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉంది. అయితే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ సంస్థలకు ఛైర్మెన్గా కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫడవిట్ ప్రకారం వివాదాస్పదంగా ఉన్న అంశంపై తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది.
మార్నింగ్ అసెంబ్లీలో పిల్లలచేత చేతులు జోడించి, కళ్లు మూయించి సంస్కృతం, హిందీలో శ్లోకాలు చదివించడం తప్పనిసరి చేయడం అనే అంశంపై మంత్రిత్వ శాఖకు ఎలాంటి పట్టింపు లేదని తెలిపింది. అంతేకాదు ఈ పిటిషన్ను కొట్టివేయాల్సిందిగా కోర్టులకు తెలిపింది హెచ్ఆర్డీ శాఖ. కేవీఎస్కు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రే ఛైర్పర్సన్గా ఉన్నప్పటికీ ఇలాంటి అంశాలతో తమకు సంబంధం ఉండదని, దీనిపై స్పందించేందుకు ఏమీ లేదు కనుక పిటిషన్ను కొట్టివేయాల్సిందిగా కోర్టును కోరింది.
కేంద్రీయ విద్యాలయాల్లో విద్యార్థులతో సంస్కృతంలో శ్లోకాలు పాడించడం ద్వారా హిందూ మతాన్ని ప్రమోట్ చేస్తున్నారని... ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, వాక్స్వాతంత్ర్యం), ఆర్టికల్ 28(1), (ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలల్లో మతపరమైన సూచనలు చేయడం) ఉల్లంఘించినట్లు అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు.
పిటిషన్పై స్పందించాలంటూ కేంద్ర మానవవనరుల శాఖకు ఈ ఏడాది జనవరిలో సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. కేంద్రీయ విద్యా సంస్థలు స్వయంప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థలని... పలు బోర్డ్ ఆఫ్ గవర్నర్లు కమిటీలుగా ఏర్పడి ఈ విద్యాసంస్థలను నడుపుతున్నారని వివరణ ఇచ్చింది. సెప్టెంబర్ 10న మళ్లీ జస్టిస్ రోహింటన్ ధర్మాసనం ముందుకు పిటిషన్ విచారణకు రానుంది. కేంద్రీయ విద్యాలయాల్లో అసతోమా సద్గమయా అనే సంస్కృత శ్లోకం కచ్చితంగ హిందు మతాన్ని ప్రమోట్ చేసేలా ఉందంటూ జబల్ పూర్లోని లాయర్ షా పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
కేంద్రీయ విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టిన కొత్త విద్యావిధానం కోడ్ను కూడా పిటిషన్లో సవాలు చేసింది. 2012లో కొత్త విద్యావిధానాన్ని తయారు చేసి 2013 నుంచి వాటిని పాటించాల్సిందిగా కేవీఎస్ పేర్కొంది. దాని ప్రకారం ఉదయం అసెంబ్లీలో విద్యార్థులు సంస్కృతంలో శ్లోకంతో ప్రారంభించి అసెంబ్లీని ముగించే ముందుకూడా మరో సంస్కృతం శ్లోకం "ఓమ్ సాహ నవవతు" చెప్పాలని పేర్కొంది. ఇలా విద్యార్థలతో పలికించడం ద్వారా విద్యార్థికి ఎప్పుడైనా ఇబ్బందులు కలిగినప్పుడు భగవంతుడున్నాడులే అన్నీ చూసుకుంటాడని అనుకునే ప్రమాదం ఉందని... తన వంతుగా ప్రయత్నించడం మానేసి మరింత ఇబ్బందుల్లోకి కూరుకుపోయే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నాడు.