మేం చెత్త ఏరుకునేవాళ్లం కాదు: కేంద్రంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: ఘన వ్యర్థాల నిర్వహణ విషయమై కేంద్రంపై సుప్రీం కోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్రం 845 పేజీల అఫిడవిట్ను సుప్రీంకు సమర్పించింది. అందులో పూర్తి సమాచారం లేకపోవడంతో ఆగ్రహించింది.
మీ ఉద్దేశ్యం ఏమిటి, మమ్మల్ని ప్రభావితం చేయాలని చూస్తున్నారా, ప్రతి చెత్తనూ మాపై పోసేయాలని భావిస్తున్నారా, దీనిని అంగీకరించేది లేదు, మీ దగ్గర ఉన్న చెత్తను అంతా మా ముందు పారేస్తున్నారు, మేం చెత్త సేకరించేవాళ్లం కాదని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. అని సుప్రీం.. కేంద్రానికి చివాట్లు పెట్టింది.
ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయో తెలపాలంటూ సుప్రీం గతంలో కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రస్థాయి సలహా బోర్డులను ఏర్పాటు చేశాయా, ఎప్పుడు చేశాయి, సభ్యులెవరు.. పూర్తి వివరాలు అందించాలని సుప్రీం ఆదేశించింది.

దీంతో కేంద్రం తరఫు కౌన్సెల్ ఈ వివరాలపై అపిడవిట్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం కొన్ని ప్రశ్నలు అడగగా. కౌన్సెల్ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయింది. దీంతో కేంద్రంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏం జరిగిందంటే..
డెంగీ సోకిన ఏడేళ్ల బాలుడికి చికిత్స చేయడానికి 2015లో అయిదు ప్రయివేటు ఆసుపత్రులు నిరాకరించాయి. అనంతరం అతను మరణించాడు. తీవ్ర ఆందోళనకు గురైన అతని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసును సుప్రీం సుమోటోగా స్వీకరించింది. ఘన వ్యర్థాల నిర్వహణపై గత ఏడాది డిసెంబర్ 12న విచారించింది.












Click it and Unblock the Notifications