సుప్రీంకోర్టుకు అఫిడవిట్: వ్యాక్సిన్పై వ్యూహాన్ని సమర్థించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ పెను సంక్షోభానికి కారణమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగింపుపై కేంద్రానికి పలు ప్రశ్నల వర్షాన్ని కురిపిించింది. దేశంలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్పై అఫిడవిట్ అందజేయాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా కేంద్రం సమర్పించిన అఫిడవిట్లో పలు కీలక అంశాలను పొందుపరిచింది.
రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన మీదటే తాము మూడోదశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేంద్రం అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఈ దశలో 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలనేది ఈ మూడోదశ ఉద్దేశం. ఈ నెల 1వ తేదీ నాడే దీన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. వ్యాక్సిన్ కొరత కారణంగా చాలా చోట్ల వాయిదా పడింది. ఏపీ, తెలంగాణల్లోనూ మూడోదశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. బిహార్, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాలు వారం రోజుల తరువాత దీన్ని చేపట్టాయి.
మూడోదశ వ్యాక్సిన్ విషయంలో తాము ఎలాంటి వివక్షతను చూపట్లేదని కేంద్రం వివరించింది. వ్యాక్సిన్ ధర విషయంలోనూ తన వైఖరిని కేంద్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్ ద్వారా స్పష్టం చేసింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ను రూపొందిస్తోన్న సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలతో తాము సంప్రదింపులు జరిపామని, ఫలితంగా కొంత మేర టీకా ధరలను తగ్గించిన విషయాన్ని గుర్తు చేసింది. వ్యాక్సిన్ డోసులను అన్ని రాష్ట్రాలకూ సమానంగా పంపిణీ చేస్తున్నామని, ఎక్కడా వివక్షతను ప్రదర్శించట్లేదని వివరించింది.
రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులను పంపించడంలో కేంద్ర ప్రభుత్వం వివక్షతను చూపిస్తోందంటూ వచ్చిన వార్తలపై ఇదివరకు జస్టిస్ లావు నాగేశ్వర రావు, రవీంద్ర భట్తో కూడిన బెంచ్ స్పందించిన విషయం తెలిసిందే. పౌరుల మధ్య ఎలాంటి వివక్షత ఉండకూడదంటూ ఈ బెంచ్ వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడికీ వ్యాక్సిన్ అందేలా, అందుబాటులో ఉండే ధరలో తీసుకుని రావాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేసింది. దీనికోసం ఉత్పాదక సంస్థలతో చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.