మళ్లీ నైట్ కర్ఫ్యూ: ముందు జాగ్రత్త తప్పదు: రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన
హైదరాబాద్: కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 214కు చేరింది. ఈ కేసులు ఇక్కడితో ఆగిపోతాయనడానికి ఎలాంటి గ్యారంటీ ఉండట్లేదు. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను నిర్వహించుకోవడానికి దేశ ప్రజలు సమాయాత్తమౌతున్నారు.
Recommended Video
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి కోట్లాదిమంది ఒకేచోట గుమికూడటం ఏ మాత్రం మంచిది కాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకలు రాత్రి పూటే నిర్వహించే పరిస్థితి ఉన్నందున.. దీన్ని నివారించడానికి కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా- నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేసింది. నైట్ కర్ఫ్యూను విధించే అంశాన్ని అన్ని రాష్ట్రాలు పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలను రాయనున్నారని తెలుస్తోంది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని, అన్ని ఆసుపత్రుల్లో 40 శాతం పడకలను సిద్ధం చేసుకోవాలని సూచించాలని నిర్ణయించింది.
కోవిడ్ పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా, క్లస్టర్లుగా ప్రకటించాలని రాష్ట్రాలకు సూచించ అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా తాము జారీ చేసే కోవిడ్ ప్రొటోకాల్స్ తప్పనిసరిగా పాటించేలా ఉత్తర్వులను జారీ చేయాలని, వాటిని కఠినంగా అమలు చేయాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్లు, క్లస్టర్ల నుంచి సేకరించిన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం ఇన్సాకాగ్ ల్యాబొరేటరీలకు పంపించాలని రాష్ట్రాలను ఆదేశించనుంది.
సుప్రీంపై బ్రాహ్మణుల పెత్తనం: కొలీజియం..ఓ మిస్టరీ: ఎంపీ: ఆ స్పీచ్ సూపర్: వెంకయ్య ప్రశంస
ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి జిల్లాస్థాయిలో సమీక్షలను చేపట్టాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని రాజేష్ భూషణ్ సూచించారు. మహారాష్ట్ర, ఢిల్లీల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. తెలంగాణ-24, కర్ణాటక-19, రాజస్థాన్-18, కేరళ-15, గుజరాత్-14, జమ్మూ కాశ్మీర్-3, ఒడిశా-2, ఉత్తర ప్రదేశ్-2, ఏపీ-2, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లల్లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు రికార్డయినట్లు చెప్పారు.