భారత్ కు పాకిస్తాన్ హాకీ జట్టు ? కేంద్రం మరో సంచలన నిర్ణయం..!
కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న భారత్-పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పహల్గాంలో 26 మంది టూరిస్టుల్ని పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులపై దేశంలో జనం రగిలిపోయారు. దీంతో కేంద్రం దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అంతే కాదు పాకిస్తాన్ తో కీలకమైన సింధు జలాల ఒప్పందం రద్దు చేసేసింది. అలాగే పాకిస్తాన్ న్యూస్ ఛానళ్లు, సెలబ్రిటీల సోషల్ అకౌంట్లు ఇలా ప్రతీదీ నిషేధించింది. వీటితో పాటు పాకిస్తాన్ తో ఇకపై ఎలాంటి క్రీడలు కూడా ఆడకూడదని కూడా నిర్ణయం తీసుకుంది.
అయితే పాకిస్తాన్ న్యూస్ ఛానళ్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లను ఆపరేషన్ సింధూర్ సందర్భంగా నిషేధించిన కేంద్రం.. తాజాగా నిన్న దీన్ని అనధికారికంగా ఎత్తేసింది. దీంతో అవన్నీ తిరిగి భారత్ లో దర్శనమివ్వడం ప్రారంభించాయి. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో తిరిగి ఇవాళ్టి నుంచి నిషేధాన్ని పునరుద్ధరించింది. ఈ వివాదం సమసిపోయిందని భావిస్తున్న తరుణంలో పాకిస్తాన్ హాకీ జట్టును భారత్ లో ఆడేందుకు అనుమతించాలని కేంద్రం భావిస్తోంది.

వచ్చే నెలలో భారత్ లో జరిగే ఆసియా కప్ లో ఆడేందుకు వచ్చే పాకిస్తాన్ జట్టును అడ్డుకోబోమని కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ వర్గాలు ఇవాళ తెలిపాయి. ఇప్పటికే పాకిస్తాన్ తో అన్ని క్రీడా సంబంధాలు తెంచుకోవాలని నిర్ణయించడం, పాకిస్తాన్ వెళ్లరాదని నిర్ణయించడం, తటస్థ వేదికలపై కూడా ఆ దేశంతో టోర్నీలు ఆడరాదని నిర్ణయించిన నేపథ్యంలో ఇవాళ ఉన్నట్లుండి భారత్ లో జరిగే ఆసియా కప్ హాకీ ట్రోఫీకి పాక్ వస్తే అడ్డుకోబోమని క్రీడాశాఖ వర్గాలు చెప్తుండటం చర్చనీయాంశమైంది. ఈ మేరకు పాక్ జట్టును అనుమతించేందుకు క్రీడాశాఖ హోంశాఖ, విదేశాంగశాఖల అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

వచ్చే నెల 29 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకూ భారత్ లోని బీహార్ లో ఆసియా కప్ హాకీ టోర్నీ జరగబోతోంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టు ఆడితే ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఆడుతున్న తొలి పాకిస్తాన్ జట్టు ఇదే కానుంది. ఆసియా దేశాలన్నీ ఆడుతున్న ఈ టోర్నీలో పాకిస్తాన్ ను అడ్డుకోబోమని, కేవలం ఆ దేశంతో ద్వైపాక్షిక టోర్నీలు ఆడేందుకే తాము వ్యతిరేకమని క్రీడాశాఖ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications