ఆ 193 మంది పాకిస్తానీలకు స్వదేశం వెళ్లేందుకు భారత్ అనుమతి..
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన 193 మంది పాకిస్తానీలకు స్వదేశం వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా వచ్చే వారం వీరిని పాకిస్తాన్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఆయా రాష్ట్రాల పోలీస్ చీఫ్లతో మాట్లాడి.. వారిని ప్రయాణానికి ఏర్పాట్లు చేయమని సూచించింది. లాక్ డౌన్ నేపథ్యంలో తమ వాళ్లు సరిహద్దు వద్దకు చేరుకోవడానికి సహకరించాలని పాకిస్తాన్ హైకమిషన్ కోరడంతో ఆ మేరకు ఆయా రాష్ట్రాల పోలీస్ చీఫ్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
మంగళవారం తెల్లవారుజాము వరకు అట్టారీ-వాఘా సరిహద్దు వద్దకు చేరుకోవాలని ఆ 193 మంది పాకిస్తానీలకు ఇప్పటికే సమాచారం అందించింది. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత వారిని పాకిస్తాన్ వెళ్లేందుకు అనుమతిస్తామని చెప్పింది. అలాగే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం.. వారికి కోవిడ్-19 స్క్రీనింగ్ నిర్వహిస్తామని.. నెగటివ్గా తేలితేనే పాకిస్తాన్కు పంపిస్తామని స్పష్టం చేసింది.

లాక్ డౌన్ పీరియడ్లో భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్తున్న రెండో అతిపెద్ద గ్రూప్ ఇదే. అంతకుముందు,ఏప్రిల్ నెలలో వెళ్లిన గ్రూపులో హర్యానా,ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,పంజాబ్ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన పాకిస్తానీలు మాత్రమే ఉన్నారు. తాజా గ్రూప్కు సంబంధించి ఇప్పటికే వారి వివరాలను సేకరించింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో పాకిస్తానీలు ఉన్నట్టు గుర్తించింది. ఇందులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,పశ్చిమబెంగాల్, గుజరాత్, రాజస్తాన్, ఛత్తీస్ఘడ్,ఉత్తరప్రదేశ్, హర్యానా,పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలున్నాయి.












Click it and Unblock the Notifications