విభిన్నంగా లాక్ డౌన్ 4.0... కొంగొత్త ఆలోచనలతో కేంద్రం...హాట్ స్పాట్లు రాష్ట్రాలకే...సడలింపులివే..?.
కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన మూడో విడత లాక్ డౌన్ ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో మరో పొడిగింపుకు కేంద్రం సిద్ధమవుతోంది. అయితే ఈసారి లాక్ డౌన్ 4.0 గతంతో పోలిస్తే విభిన్నంగా ఉండబోతోందని ప్రధాని మోడీ ఇచ్చిన సంకేతాలు సగటు భారతీయుడిలో ఆశలు రేపుతున్నాయి. ముఖ్యంగా రెండు నెలలుగా ఉపాధి కరవై, ఉద్యోగాలకు దూరమై, ఆకలితో అలమటిస్తున్న సగటు జీవులకు లాక్ డౌన్ 4.0 ఓ దారి చూపుతుందని భావిస్తున్న తరుణంలో కేంద్రం దీనిపై ఇప్పటికే కొన్ని సంకేతాలు ఇస్తోంది.
మందగించిన కరోనా రెట్టింపు సమయం, రికార్డు స్థాయిలో పెరిగిన పరీక్షల సామర్థ్యం
లాక్ డౌన్ 4.0.. ఓ కొత్త అనుభవం...
కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకపోయినా లాక్ డౌన్ విధించి రెండు నెలలు దాటిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈసారి మరిన్ని సడలింపులతో దీన్ని పొడిగించాలని భావిస్తోంది. లాక్ డౌన్ 4.0గా పిలుస్తున్న ఈ పొడిగింపు కోసం పరిమితులతో కూడిన మరిన్ని సడలింపులను సిద్ధం చేసినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. మూడో విడత లాక్ డౌన్ పొడిగింపు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో, సాధారణ పరిస్థితులు నెలకొల్పడమే లక్ష్యంగా, సడలింపులకు రూపకల్పన చేసినట్టు హోమ్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు.
లాక్ డౌన్ 4.0 సడలింపులు....
రాష్ట్రాలు అందించే బ్లూ ప్రింట్ ఆధారంగా, అవకాశమున్న ప్రతి ప్రాంతంలోనూ ప్రజా రవాణా తిరిగి ప్రారంభం అవుతుందని కేంద్రం సంకేతాలు ఇస్తోంది.
క్షేత్ర స్థాయిలో పరిస్థితులను మదించిన తరువాతే నిర్ణయాలు ఉంటాయని, లిమిటెడ్ కెపాసిటీతో స్థానిక బస్సులు నడుపుకోవచ్చని, హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాత్రం ఈ సదుపాయం ఉండదని తెలుస్తోంది. ప్రజా రవాణా నిమిత్తం బస్సులను అనుమతించిన ప్రాంతాల్లో పాసింజర్ల సంఖ్యపై నియంత్రణలు పాటిస్తూ, ఆటోలు, టాక్సీలు నడుపుకునే అవకాశాన్ని కూడా అందిస్తామని కేంద్రం చెబుతోంది.
హాట్ స్పాట్ల నిర్ణయం రాష్ట్రాలకే...
ఇక రాష్ట్రాల పరిధిలో హాట్ స్పాట్ లను నిర్ణయించుకునే అధికారం, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి బదలాయించాలని చాలా మంది సీఎంలు చేసిన డిమాండ్ పై సానుకూల నిర్ణయం వెలువడుతుందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. కంటైన్ మెంట్ ప్రాంతాలు మినహా మిగతా అన్నిచోట్లా ఈ సడలింపులు ఉంటాయని చెబుతున్నారు.
ట్రావెల్ పాస్ లను కలిగివున్నవారు రాష్ట్రాలు దాటి వెళ్లేందుకు అనుమతి లభిస్తుందని, వచ్చే వారం నుంచి విమాన సర్వీసులను నడిపించేందుకూ నిర్ణయం తీసుకోవచ్చని, ఇప్పటికే మొదలైన రైలు సేవలను మరింతగా విస్తరించేందుకు కసరత్తు జరుగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అన్ని రకాల వస్తువులనూ హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతులు లభించవచ్చన్నారు.
Recommended Video
హాట్ స్పాట్లలో మరింత కఠినం...
అదే సమయంలో వైరస్ వ్యాప్తించిన ప్రాంతాల్లో మరిన్ని కఠిన నిబంధనలు విధించాలని, రాష్ట్రాలు గుర్తించిన హాట్ స్పాట్ లలో ఎటువంటి కార్యకలాపాలకూ అనుమతి ఉండదని, మిగతా ప్రాంతాల్లో నిబంధనల సడలింపు ఉంటుందని కేంద్రం చెబుతోంది. హోంశాఖ వద్ద ఉన్న గణాంకాల మేరకు పలు రాష్ట్రాల్లోని 11.9 లక్షల మంది ప్రజలు ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
కేసుల సంఖ్య అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ లలో జిల్లాల మధ్య ప్రయాణానికి అనుమతులు ఉండబోవని, కేసులు అధికంగా ఉన్న చోట్ల పరిశ్రమలు తెరిచేందుకూ వీలుండబోదని తెలుస్తోంది. ఏపీ, కేరళ, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలు చాలా సెక్టార్లను తిరిగి తెరిపించాలని కోరాయని, బీహార్, జార్ఖండ్, ఒడిశాలు మాత్రం స్వస్థలాలకు వచ్చేస్తున్న వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ కొనసాగించాలని కోరుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.