జింఖానా స్థలం ఖాళీ చేయడంపై కేంద్రం తాజా నిర్ణయం- స్టేట్ మెంట్
కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ జింఖానా క్లబ్ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర ప్రజా ప్రయోజనాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజా ఈ ఉత్తర్వులు ఇచ్చింది. నంబర్ 2, సఫ్దర్జంగ్ రోడ్లో ఉన్న ఈ స్థలాన్ని తిరిగి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. భూ బదలాయింపునకు డెడ్ లైన్ సైతం పెట్టింది కేంద్రం. జూన్ 5వ తేదీ కల్లా ఈ భూమి మొత్తాన్ని కూడా తమకు అప్పగించాలని సూచించింది.
ఈ ఉత్తర్వులపై జింఖానా క్లబ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టులో తాజాగా పిటీషన్ దాఖలు చేసింది. సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ ఈ పిటీషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ముందు ఈ ఉదయం ఈ విషయాన్ని ప్రస్తావించారు. క్లబ్ ప్రాంగణానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యను సవాలు చేస్తూ ఒక సివిల్ వ్యాజ్యం దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఈ పిటీషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది.

నేడు ఈ కేసు విచారణకు వచ్చింది. క్లబ్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ, ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనలను వినిపించారు. క్లబ్ స్థలం, ప్రాంగణాన్ని తాము బలవంతంగా స్వాధీనం చేసుకోమని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చింది. స్థల స్వాధీనం విషయంలో చట్టప్రకారమే వెళ్తామని, ఇందులో ఎటువంటి బలవంతం ఉండబోదని తేల్చి చెప్పింది. జూన్ 5లోగా క్లబ్ స్వచ్ఛందంగా స్థలాన్ని ఖాళీ చేయాలని కోరుతున్నామని పేర్కొంది.
జూన్ 5 అనేది క్లబ్ స్వచ్ఛందంగా ఖాళీ చేయడానికి ఇచ్చిన గడువు మాత్రమేనని తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. చట్టం ప్రకారం తప్ప బలవంతంగా స్థలాన్ని స్వాధీనం చేసుకోబోమని, ఒకవేళ వారు ఖాళీ చేయకపోతే, పోలీసులు బలవంతంగా స్థలాన్ని ఆక్రమించుకోబోరని హామీ ఇచ్చారు. ప్రజా ప్రాంగణాలను ఖాళీ చేయడానికి ఉద్దేశించిన చట్టలకు అనుగుణంగా, న్యాయపరమైన ప్రక్రియను అనుసరిస్తామని తుషార్ మెహతా పేర్కొన్నారు. కేంద్రం చేసిన ఈ ప్రకటనను నమోదు చేయవచ్చా అని కోర్టు అడగ్గా ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వం భూమిని తీసుకున్నా కూడా పిటీషనర్లకు క్లబ్ లో సభ్యత్వం కొనసాగుతుందని, అంతే తప్ప లీజుదారుగా ఉండబోరని స్పష్టం చేసింది. అభిషేక్ మను సింఘ్వీ మాత్రం యథాతథ స్థితిని కొనసాగించాలని కోరారు. డెడ్ లైన్లు గానీ, ఎలాంటి బలవంతపు చర్యలు ఉండబోవని కేంద్రం ప్రభుత్వ ఇచ్చిన స్టేట్మెంట్ ను రికార్డు చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications