మోడీ సర్కారుకే టోకరా... తమిళనాడులో తీగ లాగితే... అక్కడ డొంక కదిలిందిలా..
కరోనా వైరస్ గుర్తించడానికి వాడుతున్న డయాగ్నస్టిక్ కిట్లపై దేశవ్యాప్తంగా ప్రతీరోజూ ఏదో వివాదం చుట్టుముడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న కరోనా వైరస్ టెస్టింగ్ కిట్లను కేంద్రం 60 శాతం ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ వ్యవహారమంతా తమిళనాడులో చోటుచేసుకున్న కొన్ని ఘటనల ద్వారా కావడం, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చేరడం మరింత వివాదాస్పదమైంది.
చైనా ర్యాపిడ్ కిట్లకు ఆర్డర్...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారీ ఎత్తున పరీక్షల నిర్వహణకు వీలుగా కేంద్ర ప్రభుత్వం మార్చి 27న చైనాలోని వోండ్ ఫో సంస్ధకు 5 లక్షల ర్యాపిడ్ కిట్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 16న చైనాలోని భారత రాయబారి విక్రమ్ మిస్రీ భారత్ కు ర్యాపిడ్ కిట్లతో పాటు యాంటీబాడీస్ టెస్టింగ్ కిట్లు, ఆర్.ఎన్.ఎ ఎక్సట్రాక్షన్ కిట్లు కలుపుకుని మొత్తం 6.5 లక్షల కిట్లు పంపుతున్నట్లు సమాచారం ఇచ్చారు. చైనా సంస్ధ నుంచి ర్యాపిడ్ కిట్లను ఒక్కొక్కటి 245 రూపాయల చొప్పున మ్యాట్రిక్స్ ల్యాబ్స్ దిగుమతి చేసుకుని.. రియల్ మెటబాలిక్స్, ఆర్క్ ఫార్మాసుటికల్స్ అనే రెండు సంస్ధల ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. దిగుమతి రూ.245కే జరిగినా పంపిణీ సంస్ధ రియల్ మెటబాలిక్స్ మాత్రం వీటిని రూ.600కు ఐసీఎంఆర్ కు అమ్మింది.
స్కామ్ బయటపడిందిలా...
అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం చైనా కిట్ల దిగుమతి దారు మ్యాట్రిక్స్ ల్యాబ్స్ కు చెందిన మరో పంపిణీ దారు షాన్ బయోటెక్ నుంచి రూ.600కు వీటిని కొనుగోలు చేసింది. దీంతో భారత్ లో పంపిణీకి తమకు మాత్రమే అనుమతి ఉండగా.. తమిళనాడు ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా షాన్ బయోటెక్ నుంచి రూ.600 రూపాయలకు ఎలా కొనుగోలు చేస్తుందని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ కిట్లను 60 శాతం ఎక్కువ ధరకు పంపిణీ దారులు భారత ప్రభుత్వంతో పాటు తమిళనాడు ప్రభుత్వానికి కూడా అమ్మిన్నట్లు తేల్చింది. దీంతో పాటు ర్యాపిడ్ కిట్ల ధరను జీఎస్టీతో కలిపి రూ.400 కే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే దిగుమతి చేసుకున్న ధర కంటే 60 శాతం ఎక్కువకు కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం వీటిని కొనుగోలు చేశాయన్నమాట.
ఇరుకునపడ్డ ఐసీఎంఆర్...
చైనాకు చెందిన వోండ్ ఫో సంస్ధ ద్వారా దిగుమతి చేసుకున్న కిట్లకు 60 శాతం ఎక్కువ ధరను ఎలా చెల్లించారన్న ప్రశ్నకు ఐసీఎంఆర్ వద్ద సరైన సమాధానం లేదు. దీంతో ప్రస్తుత పరిస్దితుల్లో అవసరం, టెండర్ ధర ప్రకారమే వీటిని కొనుగోలు చేసినట్లు ఐసీఎంఆర్ చెబుతోంది. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా దీనిపై మాట్లాడేందుకు ఇష్ట పడటం లేదు. మరోవైపు ఈ వివాదంతో మంచే జరిగిందని ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
కిట్ల నాణ్యతపైనా సందేహాలు..
చైనాలోని వోండ్ ఫో సంస్ధ నుంచి రూ.600 పెట్టి కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల నాణ్యత ఎంత అంటే సమాధానం చెప్పే వారు లేరు. ఇప్పటికే వీటిని భారీ రేట్లతో కొనుగోలు చేసిన రాజస్దాన్ తో పాటు పలు రాష్ట్రాలునెత్తీ నోరు బాదుకుంటున్నాయి. వీటితో ఫలితాలు సక్రమంగా రావడం లేదని ఐసీఎంఆర్ కు ఫిర్యాదులు కూడా చేశాయి. దీంతో ర్యాపిడ్ కిట్ల వాడకాన్ని మొన్నా మధ్య రెండు రోజుల పాటు నిలిపివేశాయి. అటు కొరియా నుంచి నేరుగా దిగుమతి చేసుకున్న కిట్లతో ఏపీ ప్రభుత్వం అద్భుతమైన ఫలితాలను రాబడుతున్న వేళ.. చైనా కిట్లతో ఇతర రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కోవడం ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.