ప్రధాని మోడీ రివ్యూ మీట్కి మమత, అధికారులు గైర్హాజరు: బెంగాల్ సీఎస్ను రీకాల్ చేస్తూ కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ(సీఎస్) అలపన్ బందోపాధ్యాయ్ను రీకాల్ చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. నాలుగు రోజుల క్రితమే ఆయన సీఎస్ పదవీ కాలాన్ని మూడు నెలలపాటు పొడిగించిన కేంద్రం.. తాజాగా, ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో యాస్ తుఫాను కారణంగా జరిగిన నష్టంపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పశ్చిమ మిడినిపూర్ జిల్లాలోని కలైకుండలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గవర్నర్ జగదీప్ ధనఖర్, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి హాజరు కాగా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అరగంట ఆలస్యంగా వచ్చారు.
అంతేగాక, తుఫాను నష్టంపై ఓ పత్రం ప్రధానికి అందజేసి వెళ్లిపోయారు. సీఎస్ తోపాటు ఉన్నతాధికారులు కూడా సమావేశానికి హాజరుకాలేదు. దీంతో ప్రధాని సమీక్ష సమావేశంలో సీఎం మమత హాజరుకాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలు.. మమతా బెనర్జీ అహంకారపూరితంగా వ్యవహించారని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే ఆమెకు రాజకీయాలే ముఖ్యమయ్యాయని మండిపడుతున్నారు.
ప్రధాని సమీక్ష సమావేశానికి గైర్హాజరైన నేపథ్యంలోనే సీఎస్ను రీకాల్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎస్ను ఢిల్లీలో రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Recommended Video
ప్రధాని పాల్గొన్న సమీక్ష సమావేశానికి బెంగల్ సీఎం మమతా బెనర్జీ గైర్హాజరవడంపై గవర్నర్ జగదీప్ ధనకర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. 'పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రధాని నేతృత్వంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి, ఇతర అధికారులు హాజరుకావాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు. ముఖాముఖి వైఖరి రాష్ట్ర లేదా ప్రజాస్వామ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. సీఎం, అధికారులు పాల్గొనకపోవడం రాజ్యాంగబద్ధత లేదా చట్ట నియమాలతో సమకాలీకరించబడదు ' అని బెంగాల్ గవర్నర్ జగదీప్ ధనఖర్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.