రైతులతో కేంద్రం చర్చలు మళ్లీ విఫలం- చట్టాల రద్దు డిమాండ్కు కేంద్రం ససేమిరా
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రైతులు ఢిల్లీ చుట్టూ మోహరించి చేపడుతున్న నిరసనలతో కేంద్రానికి ముచ్చెమటలు పడుతున్నాయి. దీంతో ఇవాళ రైతు సంఘాలతో నిర్వహించిన ఐదో రౌండ్ భేటీలో కేంద్రం మరికొన్ని హామీలు ఇచ్చినా మొత్తం సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రతిష్టంభన వీడలేదు. సమస్య పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని రైతు సంఘాలతో భేటీలో కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రైతులు నిరసన బాట వీడాలని సూచించింది. అయితే వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకునే వరకూ తాము తగ్గబోమని రైతు సంఘాలు తేల్చిచెప్పాయి.
రైతులతో ఐదో రౌండ్ చర్చలు విఫలం...
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై నిరసన సాగిస్తున్న రైతుల ప్రతినిధులు ఇవాళ కేంద్రంతో ఐదోరౌండ్ చర్చల్లో పాల్గొన్నారు. పది జాతీయ రైతు సంఘాలకు చెందిన 40 మంది ప్రతినిధులు ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో వారు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. రైతు సంఘాల ప్రతినిధులకు నచ్చజెప్పేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమస్య పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని, రైతు సంఘాలు సహకరించి నిరసనలు విరమించేలా రైతుల్ని ఒప్పించాలని కేంద్రం కోరింది. అయితే వ్యవసాయ బిల్లుల్లో పలు అంశాలు అన్నదాతల ఉసురు తీసేలా ఉన్నాయని ప్రతినిధులు కేంద్రానికి తెలిపారు. వాటిపై ఆమోదయోగ్యమైన పరిష్కారానికి ప్రయత్నిస్తామని కేంద్రం చెప్పింది. అయితే నిర్ధిష్టమైన హామీ లభించకపోవడం రైతు సంఘాల నేతలు ఆందోళన విరమించే విషయంలో ఏ విషయం తేల్చలేదు.
కేంద్రం తీరుతో వాకౌట్కు సిద్ధమైన నేతలు..
కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో నిర్వహించిన భేటీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, మరో మంత్రి సోం ప్రకాష్తో పాటు పంజాబ్ మంత్రి ప్రకాష్, ఇతరులు పాల్గొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉందని రైతు సంఘాలకు వీరు తెలిపారు. కానీ మొత్తం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే తప్ప తమ అందోళన విరమించే ప్రశ్నే లేదని వారు స్ఫష్ట చేశారు. దీంతో ఓ దశలో రైతు సంఘాల మొండివైఖరిపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో రైతులు కూడా చర్చల్లో నుంచి తప్పుకునేందుకు సిద్ధమని హెచ్చరించారు. దీంతో మంత్రులు కాస్త వెనక్కి తగ్గారు. పంజాబ్ సెంటిమెంట్లను తాము గౌరవిస్తామన్నారు.
మధ్యప్రదేశ్కూ పాకిన నిరసనలు..
ఇప్పటివరకూ పంజాబ్, హర్యానా, యూపీలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు తాజాగా మధ్యప్రదేశ్కూ తాకాయి. మధ్యప్రదేశ్కు చెందిన రైతులు కేంద్రం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిని హర్యానాలోని పల్వాల్ వద్ద దిగ్భందించారు. ఢిల్లీ వెళ్లేందుకు యూపీ చేరుకున్న మధ్యప్రదేశ్ రైతులను మధుర, కోసీ-కలాన్ వద్ద పోలీసులు అడ్డగించారు. మధ్యప్రదేశ్ నుంచి భారీగా బయలుదేరిన రైతులు రేపటి కల్లా యూపీలోని పలు ప్రాంతాలకు చేరుకునే అవకాశముందనే సమాచారంతో యూపీ సర్కారు కూడా అప్రమత్తమవుతోంది. రైతుల ఆందోళనలు ఇతర రాష్ట్రాలకు కూడా పాకుతుండటంతో కేంద్రానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. రైతుల ఆందోళనలకు తలొగ్గి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటే భారీ ఎదురుదెబ్బగా మారుతుందనే ఆందోళన నెలకొంది.