ఎన్నార్సీపై పార్లమెంటులో కేంద్రం క్లారిటీ- రిజిస్టర్ తయారీపై నిర్ణయం తీసుకోలేదంటూ...
జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) అమలు కోసం కొంతకాలంగా ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు మాత్రం ముందుకు వేయలేకపోతోంది. ఇప్పటికే ఎన్నార్సీ అమలుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడం, అసలే వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉండటంతో ఇప్పుడు ఎన్నార్సీపై ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్ధితి. దీంతో ఇవాళ పార్లమెంటులో ఆ మేరకు కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది.
జాతీయ పౌరసత్వ చట్టం సీఏఏ 2019 డిసెంబర్ 12న నోటిఫై చేశామని, ఇది 2020 జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్రం పార్లమెంటులో తెలిపింది. అయితే దీన్ని జాతీయ స్ధాయిలో అమలుచేసేందుకు మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా వెల్లడించింది. దీంతో పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చినా ఎన్నార్సీ అమలు కోసం కేంద్రం ముందడుగు వేయలేకపోతోందని తేలిపోయింది. గతంలో అస్సోంలో మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేసి ఎన్నార్సీ అమల్లోకి తెచ్చిన బీజేపీకి చేదు అనుభవాలు తప్పలేదు. దీంతో ఆ తర్వాత బెంగాల్లోనూ అమలు చేయాలని భావించినా వెనక్కి తగ్గింది.
ఇప్పుడు ఏకంగా జాతీయ స్ధాయిలో ఎన్నార్సీ తయారీ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కేంద్రం చెప్పేయడంతో ఇప్పట్లో ఎన్నార్సీ అమలు లేనట్లేనని తేలిపోయింది. ఎన్నార్సీని అమలు చేయొద్దంటూ గతంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరగడం, ఆయా చోట్ల బీజేపీ చేదు ఫలితాలు ఎదుర్కోవడం కూడా జరిగిపోయాయి. ఢిల్లీ వంటి చోట్ల ఎన్నార్సీ నిరసనలకు ఉద్రిక్తతలకు కూడా కారణమయ్యాయి. దీంతో ఎన్డీయే సర్కార్ ఎన్నార్సీపై పునరాలోచనలో పడాల్సి వచ్చింది.
త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నార్సీ అమలుపై పార్లమెంటులో కేంద్రం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు ముగిశాకే అప్పటి పరిస్ధితుల్ని బట్టి ఎన్నార్సీపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతవరకూ ఎన్నార్సీ పట్టి తయారీ కోసం ఎలాంటి చర్యలు చేపట్టరాదని కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ పార్లమెంటులో ప్రకటన కూడా వెలువడింది.