Omicron Virus : కరోనా వ్యాక్సిన్ మూడో డోస్ తీసుకోవాలా ? వద్దా ? తేల్చనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఓమిక్రాన్ వైరస్ భయాలు వెంటాడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు భావిస్తున్న తరుణంలో ఓమిక్రాన్ భయాలతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో కోవిడ్ వ్యాక్సిన్లకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఓమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న అంచనాలతో ఇప్పటికే రెండు డోస్ లు తీసుకున్నవారు మూడో డోస్ కు కూడా సిద్ధపడుతున్నారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ మూడో డోస్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న విధానాలను సవరించాల్సి ఉండటంతో కేంద్రం దీనిపై నిపుణులతో చర్చిస్తోంది. డిసెంబర్ రెండో వారంలో కోవిడ్ వ్యాక్సిన్ మూడో డోస్ తీసుకోవచ్చా లేదా అన్న దానిపై క్లారిటీ ఇవ్వబోతోంది. నిపుణుల బృందం మూడవ డోస్పై ఓ పత్రం విడుదల చేసే దిశగా పని చేస్తోంది, ఇది ఆరోగ్యవంతమైన వ్యక్తులకు బూస్టర్ షాట్ అవసరమా లేదా అనేది ఎవరికి ఇవ్వాలి అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం ప్రకటించనుంది.
కొత్త ఓమిక్రాన్ వేరియంట్పై ఆందోళనల మధ్య, మూడవ కోవిడ్-19 వ్యాక్సిన్ డోస్పై భారతదేశం యొక్క సమగ్ర విధానం రాబోయే రెండు మూడు వారాల్లో ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం, దేశంలో మూడవ టీకా మోతాదుపై పాలసీ పత్రాన్ని రూపొందించడానికి నిపుణుల బృందం పని చేస్తోంది. రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు అదనపు మోతాదు అవసరమా? లేదా ఆరోగ్యకరమైన వ్యక్తులకు బూస్టర్ డోస్ అవసరమా, మూడవ డోస్ ఎప్పుడు ఇవ్వాలి? ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? రెండవ, మూడవ డోస్ మధ్య గ్యాప్ ఎంత ఉండాలి? అనే అంశాల్ని ఈ పాలసీలో పొందుపర్చనున్నారు.
ఓమిక్రాన్ భయాల నేపథ్యంలో ఇప్పటికే రెండు డోస్ లు తీసుకున్న వారు కూడా మరో బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిదని ఇప్పటికే పలువురు నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్దారించేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం కూడా ఈ వాదనను నిర్ధారిస్తే అప్పుడు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టేందుకు వీలు కలుగుతుంది. దీంతో ప్రభుత్వం చేసే విధాన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.