మణిపూర్ వీడియోపై కేంద్రం సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: మణిపూర్లో చెలరేగిన హింస చల్లారట్లేదు. రెండున్నర నెలలుగా ఈ ప్రశాంత రాష్ట్రం మండిపోతూనే వస్తోంది. మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపినప్పటికీ.. ఏ మాత్రం ఫలితం ఉండట్లేదు.
మే 3వ తేదీన మణిపూర్లో మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య హింస చెలరేగింది. అప్పటి నుంచి 160 మందికి పైగా మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఇప్పటివరకూ ఈ హింసాత్మక పరిస్థితులకు అడ్డుకట్ట పడట్లేదు. దాడులు, ప్రతిదాడులతో తగలబడుతూనే ఉంది మణిపూర్. రాజకీయ జోక్యం కూడా పని చేయట్లేదు.

ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి.. ఊరేగించడం, అందరూ చూస్తుండగానే వారిపై అత్యాచారానికి పాల్పడిన అమానవీయ సంఘటనల వీడియోలు వెలుగులోకి రావడం- అక్కడి హింసాత్మక పరిస్థితులకు ఆజ్యం పోసినట్టయింది. ఈ ఘటన- అటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. ఉభయసభల్లో ప్రకంపనలు పుట్టించింది.
ఈ దారుణ ఘటనకు ప్రధాన కారకుడైన హుయిరెమ్ హెరోదాస్ మెయితీ సహా మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాంగ్పోక్పి జిల్లాలో ఒక వర్గానికి చెందిన మహిళలను ప్రత్యర్థులు నగ్నంగా ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే- ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలని ఆదేశించింది.
మణిపూర్ మహిళల వైరల్ వీడియో చిత్రీకరించిన మొబైల్ ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని చిత్రీకరించిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. వైరల్ వీడియో కేసు విచారణను మణిపూర్ వెలుపల జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ కూడా దాఖలు చేయనుంది.












Click it and Unblock the Notifications