కొన్ని మంచినీళ్లివ్వండి: టిడిపి ఎంపి సుజనాపై కురియన్
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి గురువారం సభలో మాట్లాడుతుండగా గొంతు తడారి పోయింది. దాంతో కాస్త తడబాటు కనిపించింది. బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన గలగల మాట్లాడారు. దీంతో తడారిపోయింది. దానిని గుర్తించిన రాజ్యసభ చైర్మన్ కురియన్.. ఆయనకు కొన్ని మంచినీళ్లివ్వాలని సూచించారు.
సుజనా చౌదరి మాట్లాడుతూ.... తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రజాస్వామ్య విరుద్దమైనదన్నారు. ఎంతో ఆవేదనతో ఈ బిల్లుపై మాట్లాడవలసి వస్తోందన్నారు. ఎన్నికల ముందు ఈ బిల్లు పెట్టడమేమిటిని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేంద్రం ఇన్నాళ్లు ఏం చేసిందన్నారు.
ఓ పక్క వైయస్సార్ కాంగ్రెసు, మరోపక్క తెలంగాణను విలీనం చేసుకోవడానికి కాంగ్రెసు సిద్ధపడుతోందని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ సొంత నేతల మధ్యనే ఏకాభిప్రాయం తేలేకపోయిందన్నారు. లోకసభలో సీమాంధ్ర ఎంపీలను బహిష్కరించి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఆమోదించారన్నారు.

తెలంగాణ వెనుకబడలేదని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని, శాసన సభ బిల్లును తిరస్కరించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడం అన్యాయం, అప్రజాస్వామికమన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయమన్నారు. తమతో కలిసే వారితోనే కేంద్రం మాట్లాడుతోందన్నారు.
రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు కాంగ్రెసు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, గందరగోళం మధ్య బిల్లును ఆమోదించవద్దన్నారు. ప్రజాస్వామ్య దేశం అనే పేరుకు కాంగ్రెసు తీరు అపఖ్యాతి తీసుకు వస్తోందని, ఎవర్నో విమర్శించాలని తన ఉద్దేశ్యం కాదని, తెలుగు ప్రజల ఆవేదననే చెబుతున్నానని, ఇరు ప్రాంతాల్లో జెఏసిలను, ప్రజా సంఘాలను కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడలేదన్నారు.












Click it and Unblock the Notifications