సొంత రాష్ట్రానికి నిర్మల సీతారామన్ ద్రోహం
CM Siddaramaiah: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కేంద్ర ప్రభుత్వంపై కయ్యానికి కాలు దువ్వుతోంది. ఛలో ఢిల్లీ పేరుతో భారీ స్థాయిలో ఆందోళనకు పిలుపు ఇచ్చింది. నిరసనలకు దిగింది. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం ఈ నిరసన ప్రదర్శనలను చేపట్టబోతోంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా.. కర్ణాటక మంత్రులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొననున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారంతా ఈ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

వార్షిక బడ్జెట్లో కర్ణాటకకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడాన్ని నిరసిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ.. ఈ ఆందోళనలను నిర్వహించబోతోంది. రాజకీయంగా చూసుకుంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. సొంత రాష్ట్రం ఇదే. ఇక్కడి నుంచే ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తోన్నారు.
కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం, స్వయానా ఆర్థిక మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్నప్పటికీ.. బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. వివిధ పన్నుల రూపంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా నిధులను సమకూర్చుతున్నప్పటికీ.. బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర వివక్షకు గురవుతున్నామనే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమౌతోంది.

దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కలిపి ప్రత్యేక దేశం ఇవ్వాలనే డిమాండ్ను కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు డీకే సురేష్ ఇప్పటికే లేవనెత్తారు కూడా. కర్ణాటకలో అధికారాన్ని కోల్పోవడం, దక్షిణాది నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుని పోవడం వల్లే తమకు నిధులను కేటాయించట్లేదంటూ విమర్శిస్తోంది.
కర్ణాటకలో ఉన్న 28 లోక్సభ స్థానాల్లో బీజేపీ 25 సీట్లను గెలుచుకున్నప్పటికీ.. నిధుల కేటాయింపులు మాత్రం ఆ స్థాయిలో ఉండట్లేదని చెబుతోంది కాంగ్రెస్. ఈ క్రమంలో- ఢిల్లీలో జరిగే ఆందోళనకు మద్దతు ఇవ్వాలంటూ సిద్ధరామయ్య కేంద్రమంత్రులు, పార్లమెంట్ సభ్యులకూ లేఖ రాశారు. బడ్జెట్ కేటాయింపుల్లో తమ రాష్ట్రం ఏ రకంగా వివక్షకు గురవుతోందనే విషయాన్నీ వివరించారు.












Click it and Unblock the Notifications