బెంగళూర్లో చంద్రబాబు రోడ్డు షో! పెట్టుబడులకి ఉత్సాహం
బెంగళూరు/హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకోసం నవంబర్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నాటక రాజధాని బెంగళూరులో రోడ్ షోను నిర్వహించనున్నారని తెలుస్తోంది.
ఏపీలో పరిశ్రమల స్థాపన కోసం నూతన ఏకగవాక్ష విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం పరిధిలో ఆరు శాఖలు మాత్రమేఉన్నాయి. తాజాగా ఈ చట్టం పరిధిలోకి మరో ఆరు శాఖలను చేర్చారు.
కాగా, ఏపీలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించే యాజమాన్యాలకు అదే స్థాయిలో ప్రోత్సాహకాలను ఇచ్చేలా ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది. ఈ ముసాయిదా విధానంపై భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ప్రతినిధులతో ఈ నెల 30న ఏపిఐఐసి కార్యాలయంలో సమీక్షించనున్నారు.

ఇప్పటి వరకూ ప్రభుత్వం తనంత తానుగా పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తూ వచ్చింది. కాని రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామిక విధానంపై పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ తెలిపారు.
తెలంగాణ పారిశ్రామిక విధానం కంటే మరింత మెరుగైన పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ యోచిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఉందని, 247 విద్యుత్తు సరఫరా రాష్ట్రానికి కలసి వచ్చే అంశమని పరిశ్రమల శాఖ వర్గాలు భావిస్తున్నాయి.
పొరుగు రాష్ట్రాల్లో విద్యుత్తు కొరత పీడిస్తుండడంతో పలువురు పారిశ్రామికవేత్తలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించేందుకు ఉత్సాహం చూపుతున్నారంటున్నారు. చెన్నై విమానాశ్రయానికి దగ్గరలో ఉండడం, కృష్ణపట్నం ఓడ రేవు నుంచి సరుకు రవాణా సులువు కావడం వంటి పలు అంశాలు నెల్లూరు జిల్లాకు కలసి వస్తున్నాయని, శ్రీ సిటీలో మౌలిక వసతుల కల్పన విస్తృతంగా ఉండడం చిత్తూరు జిల్లాకు కలసి వస్తుందంటున్నారు.












Click it and Unblock the Notifications