బాబు.. బెజవాడ ఎందుకొచ్చావమ్మ.. చంద్రబాబుపై గోరంట్ల మాధవ్ సెటైర్లు
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై అధికార పార్టీ నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. ఆ పార్టీ ఎంపీలు కూడా వదలడం లేదు. చంద్రబాబుపై వైసీపీ నేత, అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ హాట్ కామెంట్స్ చేశారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న గోరంట్ల సోమవారం సహచర ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, మార్గాని భరత్లతో కలిసి మీడియాతో మాట్లాడారు.
టీడీపీపైనా, చంద్రబాబుపైనా గోరంట్ల మాధవ్ విమర్శలు గుప్పించారు. గత ఎన్నికలో టీడీపీకి చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్నారు. ముగ్గురు టీడీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. చచ్చిన పార్టీని బతికించుకోవడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలను తమతో కలిసి రమ్మంటే రాలేదని ఆయన ఆరోపించారు. కానీ పైకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని స్పీచ్ ఇస్తారని దుయ్యబట్టారు. వారిది పైకి ఒకలా... లోన మరోలా ఉంటారని ధ్వజమెత్తారు.
ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న చంద్రబాబు హైదరాబాద్ నుంచి పరారై విజయవాడ వెళ్లిపోయారన్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు.. ఏపీ సీఎంగా ఉన్న హైదరాబాద్లోనే ఎక్కువ సమయం ఇచ్చేవారు. ప్రతిపక్ష నేత అయిన తర్వాత.. ఇక్కడే మకాం వేశారు. దీనిపై వైసీపీ నేతలు చాలా సందర్భాల్లో విమర్శలు చేశారు. ఇప్పుడు ఓటుకు నోటు కేసు వల్ల మళ్లీ బెజవాడకు పయనం అయ్యారని చెప్పారు. చాలా రోజుల తర్వాత తెరపైకి ఓటుకు నోటు కేసు విషయం వచ్చింది. 'బీసీలు జడ్జీలుగా పనికిరారని చెప్పిన నీచుడు చంద్రబాబు అని గోరంట్ల మాధవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదవీకి కులాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదన్నారు. కుల, మతాలతో రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు.