నాల్గు రోజులు ఆలస్యమైతే ఏమిటి: టీపై చంద్రబాబు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నాలుగు రోజులు ఆలస్యమైతే ఏమిటని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజనపై జాతీయ స్థాయిలో అఖిల పక్ష చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర విభజన విషయంలో హేతుబద్ధత లేదని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు నియమ నిబంధనలు పాటించకుండా విభజన ప్రక్రియను ముమ్మరం చేస్తున్న కేంద్ర మంత్రులకు సిగ్గు లేదని ఆయన అన్నారు. ఛండీగడ్ నుంచి ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ విషయంలో రాజ్యంగ ఉల్లంఘన జరగకూడదని ఆయన అన్నారు. తెలంగాణ అనేది చాలా సున్నితమైన అంశమని ఆయన అన్నారు. ఇటువంటి సున్నితమైన అంశంపై హడావిడి చేయకూడదని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరిపి, ఇరుప్రాంతాల ప్రజల ఆమోదయోగ్యం తెలిపితే ముందుకు సాగాలని చంద్రబాబు నాయుడు హితవు పలికారు. సోనియా గాంధీని ఆయన మరోసారి సోనియా గాడ్సేగా అభివర్ణించారు.
గతంలో ఇందిరాగాంధీ 352 సెక్షన్ కింద అత్యవసర పరిస్థితి విధించినప్పుడు దానికి తగిన ఫలితం ఇందిరా అనుభవించిందని ఇప్పుడు అదే పరిస్థితి సోనియాకు కూడా ఎదురవుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ఇష్టం లేనందునే సొంత పార్టీ నేతలు సోనియాకు ఎదురు తిరిగారని చంద్రబాబు తెలిపారు. తమ పార్టీ సభ్యులు పార్లమెంట్లో గందరగోళం సృష్టిస్తున్నప్పుడు సోనియా, ప్రధాని ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వాలంటే సీమాంధ్రను ఒప్పించాలని, సమైక్యంగా ఉంచాలంటే తెలంగాణను ఒప్పించాలని ఆయన అన్నారు.
పార్లమెంట్లో గొడవకు దిగిన కొంతమంది సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్ మీరా కుమార్ది పక్షపాత వైఖరని, సోనియా ఆదేశాలమేరకు ఆమె ఇలా ప్రవర్తిస్తున్నారని బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పంజాబ్ ముఖ్యమంత్రి బాదల్ ఆహ్వానం మేరకు ఛండీగఢ్లో కిసాన్ ర్యాలీలో పాల్గొన్నానని చంద్రబాబు తెలిపారు. చండీగఢ్ విమానాశ్రయంలో నరేంద్రమోదీతో రెండు నిముసాలపాటు మాట్లాడానని ఆయన చెప్పారు. ఢిల్లీ విమానాశ్రయంలో సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ను కలిసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనపై ఒక్కసారి కూడా బహిరంగంగా మాట్లాడని సోనియాకు జాతీయ పార్టీ అధ్యక్షురాలిగా ఉండే అర్హత లేదని చంద్రబాబు అన్నారు.