చేతికి అందేంత దూరంలో చందమామ! చంద్రయాన్-2..ఇక విక్రమ్: వేరుపడ్డ ల్యాండర్!
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ చందమామకు మరింత చేరువైంది. చేతికి అందేంత దూరానికి చేరుకుంది. ఇక జాబిల్లిని ముద్దాడటమే బాకీ ఉంది. ఈ నెల 7వ తేదీ నాటికి అదీ పూర్తవుతుంది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో పరిభమ్రిస్తోన్న చంద్రయాన్-2..సోమవారం మధ్యాహ్నం తన మలిదశను విజయవంతంగా ముగించింది. చంద్రుడి చివరి కక్ష్యలో ప్రవేశించింది. మధ్యాహ్నం 1:15 నిమిషాల సమయంలో చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ నుంచి ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా విడిపోయిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. అదే సమయంలో ల్యాండర్ చంద్రుడి చివరి కక్ష్యలోకి ప్రవేశించిందని తెలిపారు.
అతను వ్యోమగామి కాదు..అది చంద్రుడి ఉపరితలం కాదు గానీ.. నగర రోడ్ల దుస్థితి!
దక్షిణ ధృవం వైపు ప్రయాణం..
ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ చందమామ ఉపరితలానికి దగ్గరగా 119 కిలోమీటర్లు, 127 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోందని తెలిపారు. స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణం గానీ, ల్యాండర్ విడిపోవడం గానీ సజావుగా సాగిందని వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో.. అంటే వచ్చే 48 గంటల పాటు ఆర్బిటర్ లో పరిభ్రమిస్తూ ఉండే విక్రమ్ ల్యాండర్ను చందమామకు మరింత చేరువగా తీసుకెళ్తారు. ఈ రెండు చర్యల ద్వారా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవం వైపు కదులుతుంది. అనంతరం ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్య విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ విడిపోయి జాబిల్లి మీద అడుగు పెడుతుంది. విక్రమ్ ల్యాండర్ ను చివరిదశ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత.. దానితో సంబంధాలను కోల్పోతుంది స్పేస్ క్రాఫ్ట్. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు.
సజావుగా విడిపోయిన ల్యాండర్
కిందటి నెల 22వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణం సజావుగా సాగుతోందని శాస్త్రవేత్తలు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతరిక్షంలోకి వెళ్లిన కొద్దిరోజుల తరువాత భూగోళానికి సంబంధించిన కొన్ని తాజాగా ఫొటోలను పంపించింది. దీనితో- స్పేస్ క్రాఫ్ట్ పనితీరులో ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదని శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు. ఇక సాఫ్ట్ ల్యాండింగ్ పై వారు దృష్టి పెట్టారు. వచ్చేనెల 7వ తేదీన చోటు చేసుకునే సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన దశ అని వారంటున్నారు. ప్రస్తుతం చంద్రయాన్-2 నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయే సమయంలో ఎలాంటి సాంకేతికపరమైన లోపాలు గానీ, ఆటంకాలు గానీ ఎదురు కాలేదని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
సాఫ్ట్ ల్యాండింగ్ కీలకం
ఇస్రో మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ టెలిమెట్రీ విభాగం ద్వారా దాని గమనాన్ని పరిశీలిస్తున్నారు. బెంగళూరు శివార్లలోని బ్యాలాలు వద్ద నెలకొల్పిన ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్, టెలిమెట్రి, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ ల ద్వారా దాన్ని ఆపరేట్ చేస్తున్నారు. చంద్రయాన్-2 ప్రాజెక్టులో ఇక మిగిలి ఉన్నది సాఫ్ట్ ల్యాండింగ్ ఒక్కటే. దీని కోసం శాస్త్రవేత్తలు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. చందమామ దక్షిణ ధృవాన్ని చేరుకోవాలనేది చంద్రయాన్-2 లక్ష్యం. నిర్దేశిత వేగానికి మించి ల్యాండర్ ను చంద్రుడి దక్షిణధృవం వైపు ల్యాండ్ చేయించడం వల్ల క్రాష్ అయ్యే ప్రమాదం ఉందని, అందుకే - ఒక్క సెకెను తేడా వచ్చినా ల్యాండర్ కు ముప్పు తప్పదని అంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించే అవకాశం ఉంది.