సిబిఐతో బెదిరించలేరు, నేను దేనికీ భయపడను: మోడీ
ముంబై: సిబిఐతో తనను బెదిరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని కానీ తాను దేనికి భయపడే వ్యక్తిని కాదని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సోమవారం అన్నారు. తనను సిబిఐతో బెదిరించలేరన్నారు. ముంబై విమానాశ్రయంలో బిజెపి మద్దతుదారులనుద్దేశించి మాట్లాడారు.
బిజెపి అధికారంలోకి రాకుండా ప్రభుత్వం సిబిఐని రంగంలోకి దించిందని అయితే, సిబిఐతో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ను, బిఎస్పీ అధినేత్రి మాయావతిని తమ దారిలోకి తెచ్చుకున్నట్లుగా, తనను మాత్రం తెచ్చుకోవడం ప్రభుత్వం వల్ల కాదన్నారు.

సిబిఐతో పాటు ఐబి, రా ఇంకా ప్రపంచంలోని ఏ ఏజెన్సీతోనైనా సరే తనను బెదిరించడం అసాధ్యమన్నారు. వాళ్లు తనలో సిబిఐ అనే భయాన్ని కలిగించడానికి చూస్తున్నారన్నారు. ఈ రోజు రాత్రి కాంగ్రెసు వాళ్లు తన కార్యక్రమ వీడియోను తెప్పించుకొని చూస్తారని, తనతో కరచాలనం చేసి, కలిసిమెలిసి ఉన్న వారిపై ఆదాయ పన్ను దాడులు చేయిస్తారని ఆరోపించారు.
ఛత్రపతి శివాజీ పుట్టిన గడ్డమీద తానున్నానని, దోపిడీకి, వివక్షకు గురవుతున్న ప్రజలకు సేవ చేసేందుకు తనను ఆశీర్వదించమని ఈ ప్రాంతాన్ని కోరుకుంటున్నానని చెప్పారు. యువత మరెంతో ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే బిజెపి అధికారంలో వస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications