చెక్ బౌన్స్ లకు చెక్; సంచలననిర్ణయం దిశగా కేంద్రం; ఇక అలా చెక్కులిస్తే కష్టమేనట!!
చెక్ బౌన్స్ కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, చెక్ బౌన్స్ వ్యవహారాలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. చెక్ బౌన్స్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వీటికి చెక్ పెట్టడానికి సిద్ధమైన కేంద్ర ఆర్థిక శాఖ ఈమేరకు సమాలోచనలు జరుపుతోంది. చెక్ బౌన్స్ వ్యవహారంలో విపరీతంగా పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకొని, ప్రత్యామ్నాయాలపై దృష్టి సాధించింది కేంద్రం.

చెక్ బౌన్స్ లకు చెక్ పెట్టే యోచనలో కేంద్రం
భారతదేశంలో, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 లక్షల చెక్ బౌన్స్ కేసులున్నాయి. పెరుగుతున్న కేసులతో చెక్ బౌన్స్ లకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న కేంద్రం ఆ దిశగా కీలక నిర్ణయాలను తీసుకోనుంది. చెక్ ఇచ్చిన వ్యక్తుల బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకుంటే ఆ వ్యక్తికే చెందిన ఇతర బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమెటిక్ గా డబ్బు కట్ అయ్యే విధానం తీసుకురావాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. చెక్ జారీచేసిన బ్యాంకులో డబ్బులు లేకపోతే, వారికి సంబంధించిన ఇతర బ్యాంకు ఖాతాల నుండి డబ్బులు నేరుగా సంబంధిత వ్యక్తికి ఇచ్చేలా నిబంధనలు మార్చాలని యోచిస్తోంది.

చెక్ బౌన్స్ కాకుండా ఇలా చెయ్యాలి .. కేంద్రానికి ప్రతిపాదనలు
అంతేకాదు చెక్ బౌన్స్ అవుతున్న వారికి కొత్త ఖాతాలు తెరవడానికి వీలు లేకుండా నిషేధం విధించాలని కూడా ఆలోచిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వివిధ వర్గాలతో కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి చర్చించింది. ఈ సమావేశంలో పలువురు కీలక సూచనలు చేశారు. చెక్ బౌన్స్ అయిన వ్యక్తికి చెందిన ఇతర బ్యాంకు ఖాతాల నుండి నగదు నేరుగా చెల్లించడంతో పాటు, చెక్ బౌన్స్ ను రుణాల ఎగవేతగా పరిగణించాలని కొందరు నిపుణులు కేంద్రానికి సూచనలు చేశారు. చెక్ బౌన్స్ అయిన వారికి క్రెడిట్ బ్యూరో ఇచ్చే క్రెడిట్ స్కోర్ ను కూడా తగ్గించేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

చెక్ బౌన్స్ ల వ్యవహారం చట్టపరమైన సమస్యగా మారకుండా చర్యలకు ప్లాన్
ఇక ఈ ప్రతిపాదనలు అన్నింటినీ అమలు చేస్తే ఖాతాదారులు చెక్కుల జారీ విషయంలో జాగ్రత్త వహిస్తారని పేర్కొన్నారు. ఇక చెక్ బౌన్స్ ల వ్యవహారం చట్టపరమైన సమస్యగా మారకుండా ఉండే అవకాశం ఉంటుందని, వివిధ కోర్టులలో ఉన్న చెక్ బౌన్స్ కేసులను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకోవాలని పలువురు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ముందు ప్రతిపాదనలు పెట్టారు. ఈ ప్రతిపాదనలు అమలు చేయడానికి పెద్ద ఎత్తున సమాచారాన్ని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, చెక్ ఇచ్చిన వ్యక్తికి ఏ బ్యాంకులో నగదు ఉన్నా సరే ఆటో డెబిట్ కావడానికి నిర్దిష్ట నిర్వహణ ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడ్డారు.

చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారానికి సుప్రీం ధర్మాసనం ఉన్నత స్థాయి కమిటీ
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 35 లక్షల చెక్ బౌన్స్ కేసులో పెండింగ్లో ఉండడాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు వీటి సత్వర పరిష్కారానికి కావాల్సిన సలహాలు సూచనలు ప్రతిపాదించ వలసిందిగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయగా ఈ కమిటీ వివిధ వర్గాలతో సమాలోచనలు జరిపిన తరువాత పలు కీలక సూచనలు చేసింది. చెక్ బౌన్స్ కాకుండా నిబంధనల్లో మార్పులు తీసుకు రావాలని, కాస్త కఠినంగా వ్యవహరించాలని సూచించింది.












Click it and Unblock the Notifications