నా భర్తకు చావు గిఫ్ట్: మిస్ అయ్యింది, పోలీస్ ఫోన్ తో ప్రియుడికి ఫోన్, ప్లాన్ రివర్స్!
చెన్నై: ప్రియుడి మోజులో పడి కన్నబిడ్డలకు విషం ఇచ్చి హత్య చేసిన కిరాతకురాలు అభిరామి (27) పోలీసుల విచారణలో వెల్లడించిన వివరాలు తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. తన భర్తకు గిఫ్ట్ గా చావును ఇవ్వాలని అనుకున్నానని, అయితే మిస్ అయ్యిందని చెన్నైకు చెందిన అభిరామి చెప్పడంతో కేసు విచారణ చేస్తున్న పోలీసులకే దిమ్మతిరిగిపోయింది. ట్రాఫిక్ పోలీసు మొబైల్ తీసుకుని ప్రియుడికి ఫోన్ చేసి చిక్కిపోయిన అభిరామికి ఇద్దరు బిడ్డలను హత్య చేశానని ఎలాంటి బాధ లేదని పోలీసులు అంటున్నారు.
ప్రేమ వివాహం
చెన్నైలోని ప్రైవేట్ బ్యాంకులో హోం లోన్స్ విభాగంలో ఉద్యోగం చేస్తున్న విజయ్ (32), అభిరామి (27) ప్రేమించుకుని 8 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. విజయ్, అభిరామి దంపతులకు అజయ్ (7), కారుణిక (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
హాయిగా కాపురం
విజయ్, అభిరామి దంపతులు చెన్నైలోని కండ్రత్తూరులోని అగస్తియార్ కోయిల్ స్ట్రీట్ లో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ హాయిగా కాపురం చేసుకుంటున్నారు. పిల్లలను పిలుచుకుని స్కూల్ దగ్గర వెళ్లి రావడానికి భార్య అభిరామికి కష్టం అవుతోందని విజయ్ ఆమెకు స్కూటర్ కొని ఇచ్చాడు. అయితే స్కూటర్ లో షికార్లు తిరగడం మొదలు పెట్టిన అభిరామి ఇంటి సమీపంలోని బిరియాని సెంటర్ లో పని చేస్తున్న సుందరం వలలో పడి అక్రమ సంబంధం కొనసాగించింది.
దర్జాగా వెళ్లిపోయింది
శుక్రవారం రాత్రి బిడ్డలు అజయ్, కారుణికకు పాలల్లో విషం కలిపి ఇచ్చి హత్య చేసిన అభిరామి భర్త ఇంటికి రాడని తెలుసుకుని ఇంటికి బయట తాళం వేసి ముఖంకు చున్నీ చుట్టుకుని మొబైల్ లో పాటలు వింటూ తన స్కూటర్ లో దర్జాగా ప్రియుడు సుందరం ఇంటికి వెళ్లింది. తరువాత సుందరం సూచన మేరకు చెన్నైలోని కోయంబేడు బస్ స్టాండ్ చేరుకున్న అభిరామి తన స్కూటర్ ను పార్కింగ్ స్థలంలో పార్క్ చేసింది.
సీసీ కెమెరాలు
కోయంబేడు బస్ స్టాండ్ లో అభిరామి స్కూటర్ పార్కింగ్ చెయ్యడం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. అక్కడి నుంచి బస్సులో అభిరామి నాగర్ కోయిల్ వెళ్లిపోయింది. ప్రియుడు సుందరం వస్తాడని నాగర్ కోయిల్ లో అభిరామి వేచి చూసింది. అయితే అప్పటికే తన బిడ్డలు హత్యకు గురైనారని, తన భార్య అభిరామి కనిపించడం లేదని విజయ్ ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సుందరంను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసు మొబైల్ తో ఫోన్
నాగర్ కోయిల్ చేరుకున్న అభిరామి తన మొబైల్ సిమ్ కార్డు తీసివేసింది. మొబైల్ పగలగొట్టిన అభిరామి సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ లో ఉన్న ట్రాఫిక్ పోలీసు దగ్గరకు వెళ్లింది. తన మొబైల్ పోయిందని, తన భర్తకు ఒక్క ఫోన్ చేసుకుంటానని ట్రాఫిక్ పోలీసుకు మనవి చేసింది. తరువాత పోలీసు దగ్గర ఫోన్ తీసుకుని ప్రియుడు సుందరంకు నాలుగు సార్లు ఫోన్ చేసింది. అదుపులో ఉన్న సుందరంకు ఫోన్ రిసీవ్ చెయ్యాలని, ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడే ఉండాలని చెప్పాలని పోలీసులు సూచించారు. సుందరం ఫోన్ రిసీవ్ చేసి వివరాలు తెలుసుకుని నాగర్ కోయిల్ లో ఉండాలని, తాను వస్తున్నానని అభిరామికి చెప్పాడు.
పోలీసుల రివర్స్ ఫోన్
సుందరంకు వచ్చిన ఫోన్ కాల్ ఎక్కడిది అని చెన్నై పోలీసులు ఆరా తీశారు. అభిరామి చేసిన ఫోన్ నెంబర్ కు చెన్నై పోలీసులు ఫోన్ చేశారు. ఫోన్ రిసీవ్ చేసిన ట్రాఫిక్ పోలీసుకు చెన్నై పోలీసులు వివరాలు అడిగారు. తాను నాగర్ కోయిల్ ట్రాఫిక్ పోలీసు, ఎవరో ఒక మహిళ తన భర్తకు ఫోన్ చెయ్యాలంటే ఫోన్ ఇచ్చానని చెప్పాడు. చెన్నై పోలీసులు అభిరామి రూపురేఖలు నాగర్ కోయిల్ ట్రాఫిక్ పోలీసులకు చెప్పి ఆమె ఫోటోను ఆయనకు పంపించారు. అభిరామి తన దగ్గర ఫోన్ తీసుకుని ఫోన్ చేసిందని నాగర్ కోయిల్ ట్రాఫిక్ పోలీసు చెన్నై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హోటల్ లో హాయిగా
చెన్నై పోలీసులు అభిరామి తన ఇద్దరు బిడ్డలను హత్య చేసి అక్కడికి వచ్చిందని, వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను పట్టుకోవాలని నాగర్ కోయిల్ ట్రాఫిక్ పోలీసుకు మనవి చేశారు. ట్రాఫిక్ పోలీసు సమాచారం ఇవ్వడంతో స్థానిక పోలీసులు హోటల్ లో టిఫిన్ చేసి హాయిగా కుర్చుని ఉన్న అభిరామిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే చెన్నై పోలీసులు నాగర్ కోయిల్ చేరుకుని అభిరామిని అరెస్టు చేసి చెన్నై తీసుకు వచ్చారు.
భర్తకు చావు గిఫ్ట్
శుక్రవారం రాత్రి తన భర్త విజయ్ కు విషం ఇచ్చి హత్య చెయ్యాలని అనుకున్నానని, అయితే పని ఒత్తిడితో అతను బ్యాంకులోనే ఉండిపోయి బతికిపోయాడని అభిరామి చెప్పడంతో పోలీసులు షాక్ కు గురైనారు. హత్య చేసిన తన ఇద్దరు బిడ్డలు చివరిసారి చూడాలని అభిరామి ఒక్కసారి కూడా అడగకపోవడంతో ఆమెను చూసి కుటుంబ సభ్యులు, పోలీసులు అస్యహించుకున్నారు.
కేరళలో కాపురం
నాగర్ కోయిల్ నుంచి నేరుగా కేరళ వెళ్లి బిరియాని సెంటర్ పెట్టుకుని కాపురం చెయ్యాలని అభిరామి, సుందరం ప్లాన్ వేశారు. అయితే ట్రాఫిక్ పోలీసు నెంబర్ నుంచి అభిరామి ప్రియుడికి ఫోన్ చెయ్యడం, చివరికి చిక్కిపోవడంతో వారి ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. అభిరామి, ఆమె ప్రియుడు సుందరంను కోర్టు ముందు హాజరుపరచడంతో 15 రోజులు రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అభిరామి భర్త విజయ్, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.