పని ఒత్తిడి తట్టుకోలేక ఎయిర్హోస్టెస్ ఆత్మహత్య
చెన్నై: తీవ్రమైన పని ఒత్తిడి తట్టుకోలేక ఎయిర్ఇండియాలో పని చేస్తున్న ఎయిర్ హోస్టెస్ మన్ప్రీత్ పాల్(32) తమిళనాడు రాజధాని చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ఇండియాలో టెక్నీషియన్ అనూప్ నాయర్(35)ను పంజాబ్కు చెందిన మన్ ప్రీత్ పాల్ 2012లో వివాహం చేసుకుంది.
వీరికి హాసిని అనే రెండేళ్ల కూతురు కూడా ఉంది. గత ఆదివారం అనూప్ నాయర్ డ్యూటీకి వెళ్లగా.. మన్ ప్రీత్ మస్కట్ విమానంలో డ్యూటీ ఉండటంతో కుమార్తెతో ఇంట్లోనే ఉంది. కాగా, సాయంత్రం భర్తకు ఫోన్ చేసి కుమార్తెను అత్తగారింట వదిలి పెట్టానని, డ్యూటీ నుంచి వస్తూ తీసుకెళ్లాలని చెప్పింది.
దీంతో అనూప్ కుమార్తెను వెంటబెట్టుకుని తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగిందేమోనని భావించాడు. పడకగదికి తలుపులు లోపల గడియవేసి ఉండటం గమనించి, ఇరుగుపొరుగుతో కలిసి తలుపులు పగలగొట్టగా మన్ ప్రీత్ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది.
వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. దీనిపై మీనంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పని ఒత్తిడి వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు కన్నీటిపర్యాంతమయ్యారు. తమ కూతురు, అల్లుడు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, పెళ్లైన తర్వాత ఒక్కరోజు కూడా వారు గొడవపడలేదని చెప్పారు.