చెన్నై పేలుళ్లు: స్వాతి టిసిఎస్ ఉద్యోగిని, త్వరలో పెళ్లి
చెన్నై: అదే తనకు ఆఖరి ప్రయాణం అవుతుందని ఆమె అనుకోలేదు. చెన్నైలో గౌహతి ఎక్స్ప్రెస్లో మరణించిన 24 ఏళ్ల స్వాతి షా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)లో ఉద్యోగం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో గల తన బంధువుల ఇంటికి ఆమె రైలులో బయలుదేరింది. ఈ ప్రయాణం ఆమెను తిరిగిరాని లోకాలకు తీసుకు వెళ్తుందని ఆమె భావించి ఉండదు
స్వాతికి మరో రెండు నెలల్లో వివాహం జరగాల్సి ఉండిందని చెబుతున్నారు. ఆమె అక్కడికక్కడే మృత్యువాత పడింది. స్వాతి సీటు కిందనే నల్లటి సంచీలో బాంబును పెట్టినట్లు తెలుస్తోంది. అది పేలడంతో ఆమె మరణించింది. బెంగుళూర్ - గౌహతి ఎక్స్ప్రెస్ రైలు బుధవారం ఉదయం బెంగళూర్ నుంచి బయలుదేరింది.
జకీర్ హుస్సేన్ అనే ఐఎస్ఐ ఏజెంటును చెన్నై పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో తొమ్మిదో నెంబర్ ఫ్లాట్ ఫారంపై ఆగి ఉన్న రైలులో పేలుళ్లు సంభవించాయి.
స్వాతి మరణంపై టిసిఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సహోద్యోగిని కోల్పోవడం తమను దిగ్భ్రాంతికి, విచారానికి గురి చేసిందని టిసిఎస్ చెప్పింది. స్వాతి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపింది. చెన్నై ఆస్పత్రిలో స్వాతి కుటుంబ సభ్యులను టిసిఎస్ హెచ్ఆర్ బృందం సందర్శించింది.