రేపు ఇన్ఫోసిస్కు సెలవు: జయటీవి ఆఫీసులోకి వరద నీరు
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరద నీరు కారణంగా ఐటీ కారిడార్ మొత్తం నీట మునిగింది. ఐటీ కారిడార్లోని ఓఎంఆర్ రోడ్డు, వేళచ్చేరి, తాంబరం, తరమణి, జీఎస్టీ రోడ్డు, తిరువాన్మియారు, కేళంబాక్కం తదితర ప్రాంతాల్లోని ఐటీ సంస్ధలు జలమయమయ్యాయి.
అయితే కీలక సేవలకు అంతరాయం లేదని పలు ఐటీ కంపెనీలు తెలిపాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు యాక్సెంచర్, ఇన్ఫోసిస్ కార్యాలయాల్లోకి వరద నీరు చేరిపోయింది. దీంతో ఈ కార్యాలయాల్లో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇన్ఫోసిస్ కార్యాలయం క్యాంటీన్లో బల్లలు, కుర్చీలు వాన నీటిలో తేలుతూ కనిపించాయి.
దీంతో రేపు కూడా ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అంతేకాకుండా నగరంలో చిక్కుకు పోయిన ఇన్ఫోసిస్ ఉద్యోగులను రక్షించేపనిలో నిమగ్నమైంది. దీనిపై ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. తమ క్లైంట్ లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా దేశంలోని ఇతర నగరాల నుంచి సేవలను అందిస్తున్నామన్నారు.
మరోవైపు భారీ వర్షాలు, వరద నీటి వల్ల తమకు ఎటువంటి ముప్పు లేదని టీసీఎస్ ప్రకటించింది. చెన్నై కేంద్రంగా టీసీఎస్కు పదమూడు కార్యాలయాలున్నాయి. ముందస్తు జాగ్రత్తగా తమ కార్యాలయాలను టీసీఎస్ మూసివేసింది. తమ ఉద్యోగులంతా క్షేమమేనని తెలిపింది.
గత 10 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కూడా చెన్నైలోని దాదాపు అన్ని ఐటీ కంపెనీలు తమ రోజువారీ కార్యకలాపాలను పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరుకు తాత్కాలికంగా షిఫ్ట్ చేశాయి.
చెన్నైలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ
చెన్నైలో మరో 3 రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చెన్నై నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భారీ వర్షాలకు చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతింది. మరోవైపు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న చెన్నై నగరంలో పలువురు బాధితులకు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
ఇందుకు సోషల్ మీడియా సహాయం తీసుకుంటున్నారు. నీట మునగని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మేము సురక్షితంగా ఉన్నాం కదా అనుకోకుండా కష్టంలో ఉన్న వారికి సహాయం చేస్తున్నారు. మా ఇంట్లో చోటు ఉంది ఇక్కడికి రండి అని ఆహ్వానిస్తున్నారు. మేము భోజనం పెడతాం అవసరంలో ఉన్న వారు మా ఇంటికి రండి అంటూ ట్విట్టర్లో ఫోన్ నంబర్లు పోస్ట్ చేశారు.
వరద బాధితుల కోసం ఆహారం తయారుచేస్తున్నాం.. రండి అంటూ నెల్త్లె ఎక్స్ప్రెస్ రెస్టారెంట్ ఓ ట్వీట్ను పోస్ట్ చేసింది. ఇలా చాలా మంది వ్యక్తులు, కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తామని ముందుకు రావడం నిజంగా అభినందనీయం. షాపింగ్ మాల్స్, థియేటర్లు కూడా వరద బాధితులకు ఆశ్రమిస్తున్నాయి.
జయ టీవీ ఆఫీసులోకి వరద నీరు
తమిళనాడుని ముంచెత్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పుతియ తలైమురై, జయ టీవీ కార్యాలయాల్లోకి వరద నీరు చేరింది. దీంతో ఈ రెండు టీవీ ఛానళ్ల ప్రసారానికి అంతరాయం ఏర్పడింది. ఇది ఇలా ఉంటే చెన్నై జూపార్క్ నుంచి 40 మొసళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
చెన్నై రోడ్లన్నీ జలమయం కావడంలో వరద నీటిలో వస్తున్న పాములు ఇళ్లు, అపార్ట్ మెంట్లలో సంచరిస్తున్నాయి. దీంతో నగరవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భారీ వర్షాలు, వరదలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.