మొత్తం 260: ఇన్ఫోసిస్లోకి వరద నీరు, నదిలా ఎయిర్ పోర్టు
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా భారీ వర్షాలు చెన్నైని ముంచెత్తుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ప్రజల జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నైలోని పలు కీలక ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నెలరోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా మృతిచెందినవారి సంఖ్య 230 చేరుకోగా సోమ, మంగళవారాల్లో మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం కూడా సంభవించింది.
అయితే, వచ్చే నాలుగు రోజులు పరిస్థితి ఇలాగే ఉండొచ్చని వాతావరణశాఖ అధికారులు భావిస్తుండటంతో మరింత నష్టం వాటిల్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

భారీ వర్షాల కారణంగా నగరంలోని ఐటీ కారిడార్ మొత్తం నీట మునిగింది. ఐటీ కారిడార్లోని ఓఎంఆర్ రోడ్డు, వేళచ్చేరి, తాంబరం, తరమణి, జీఎస్టీ రోడ్డు, తిరువాన్మియారు, కేళంబాక్కం తదితర ప్రాంతాల్లోని ఐటీ సంస్ధలు జలమయమయ్యాయి.
ప్రముఖ ఐటీ కంపెనీలు యాక్సెంచర్, ఇన్ఫోసిస్ కార్యాలయాల్లోకి వరద నీరు చేరిపోయింది. దీంతో ఈ కార్యాలయాల్లో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇన్ఫోసిస్ కార్యాలయం క్యాంటీన్లో బల్లలు, కుర్చీలు వాన నీటిలో తేలుతూ కనిపించాయి.
10 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కూడా చెన్నైలోని దాదాపు అన్ని ఐటీ కంపెనీలు తమ రోజువారీ కార్యకలాపాలను పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరుకు తాత్కాలికంగా షిఫ్ట్ చేశాయి. తాజాగా మళ్లీ ఈ కంపెనీలు బెంగుళూరుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. చెన్నై-విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్, చెన్నై-హౌరా కోరమండల్ ఎక్స్ ప్రెస్, చెన్నై-అహ్మాదాబాద్ నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మరోవైపు చెన్నై ఎయిర్ విమానాశ్రయంలోని రన్ వే పైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
విమానాశ్రయం చిన్నపాటి నదిలా మారిపోయింది. దాంతో విమానాలు కాస్తా పడవల్లా తేలుతున్నాయి. వరుసగా పార్కింగ్ చేసిన విమానాలు దూరంగా పడవల్లా కనిపిస్తుంటే కేవలం చెన్నై వాసులతో పాటు విమానాశ్రయ అధికారులు సైతం విస్తుపోతున్నారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో పీకల్లోతు నీళ్లు ప్రవహిస్తుండటంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. అడయార్ నదిమీద ఉన్న వంతెన పై నుంచి నీళ్లు ప్రవహిస్తుండటంతో వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. నగరంలో ప్రజలు ఎటూ కదలడానికి వీల్లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications