చెన్నైలో 'ఆపరేషన్ మద్దత్..': రోజంతా అమ్మ క్యాంటీన్లు..
తుఫాన్ భీభత్సం నేపథ్యంలో.. అమ్మ క్యాంటీన్లను రోజంతా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విశాఖపట్నం: వార్ద తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. ఈదురు గాలులు, వర్ష భీభత్సంతో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడగా.. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. పలు రైళ్లను ఇప్పటికే రద్దు చేయగా.. విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.
తీరప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్రభుత్వం.. రక్షణ చర్యలను వేగవంతం చేసింది. నేవికి చెందిన 11యుద్ద నౌకలను సహాయ సామాగ్రి కోసం సన్నద్దం చేయగా.. విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం నుంచి ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కడ్మట్ నౌకలు సోమవారం తెల్లవారు జామున విశాఖ నుంచి చెన్నైకి బయలుదేరాయి.
యుద్దనౌకల ద్వారా వైద్య బృందాలతో పాటు గజ ఈతగాళ్లు, రబ్బరు బోట్లు, హెలీకాప్టర్లు, ఇతరత్రా సహాయ సామాగ్రి అందుబాటులో ఉండనుంది. తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో.. ప్రజలు బయటకొచ్చే పరిస్థితి లేదు కాబట్టి.. వారికోసం ఆహార పదార్థాలు, మందులను కూడా వీటి ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆపరేషన్ మద్దత్ పేరిట చేపట్టే సహాయక చర్యల్లో ఈ నౌకలు పాల్గొంటాయి.
తూర్పు నౌకాదళ ప్రధానాధికారి హెచ్సీఎస్ బిస్త్ ఈ యుద్దనౌకలను సమీక్షించారు. శివాలిక్, కడ్మట్ నౌకల్లో సిద్ధంగా ఉన్న పది డైవింగ్ బృందాలకు అదనంగా మరో ఆరు బృందాలను తమిళనాడు, పుదుచ్చేరి నౌకా ప్రాంత ఫ్లాగ్ ఆఫీసర్ ఇప్పటికే సిద్ధంగా వుంచారు. అలాగే మరో 22 టీమ్స్ ను విశాఖలో సిద్దంగా ఉంచినట్లు వెల్లడించారు. నౌకా విమనా కేంద్రాలైన రజాలీ, డేగలను నేవల్ ఎయిర్ క్రాఫ్టుల కోసం సిద్దం చేశారు.
రోజంతా అమ్మ క్యాంటీన్లు:
వార్ద తుఫాన్ ఎఫెక్ట్ తమిళనాడును వెంటాడుతుండటంతో రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. దీంతో ప్రజలెవరూ బయటకు రావద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోన్న ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
పలు స్కూల్స్, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. తుఫాన్ భీభత్సం నేపథ్యంలో.. అమ్మ క్యాంటీన్లను రోజంతా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారీ వర్షాలతో రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.