వేగంగా వస్తున్న రైలుతో సెల్ఫీ: విద్యార్థి ప్రాణం తీసింది
చెన్నై: సెల్ఫీ మోజులో పడి యువత ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. తాజాగా, తమిళనాడులోని చెన్నైలో ఇలాంటి మరో ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న రైలుతో పాటు సెల్ఫీ తీసుకోబోయి దినేశ్(16) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఎలక్ట్రిక్ ట్రైన్ వెనుక వేగంగా వస్తుంటే.. దాని ముందు సెల్ఫీ తీసుకుందామనుకున్నాడు దినేశ్. కానీ, వేగంగా వచ్చి రైలు ఢీకొనడంతో మృతిచెందాడు. 11వ తరగతి చదువుతున్న దినేశ్ చెన్నై శివారులోని జూ పార్క్కు స్నేహితులతో కలిసి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దినేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల ముంబైలో సముద్రపు అంచున సెల్ఫీ తీసుకుంటూ ఓ అమ్మాయి నీళ్లలో పడిపోయింది. ఆమెను కాపాడబోయిన యువకుడూ నీటిలో మునిగిపోయాడు. ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ఘటనతో ముంబై పోలీసులు నగరంలో 16 ప్రాంతాలను నో సెల్ఫీ జోన్గా ప్రకటించారు.