త్వరపడండి! డిసెంబర్ 31 తరువాత ఆ బ్యాంకుల చెక్ బుక్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు పనిచేయవు..
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో విలీనమైన ఆరు బ్యాంకుల ఖాతాదారులు త్వరపడాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే.. 2017 డిసెంబర్ 31 తరువాత ఆయా బ్యాంకుల ఖాతాదారుల వద్దనున్న చెక్ బుక్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు పని చేయవు మరి!
ఈ ఏడాది ప్రారంభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్ పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ సహా భారతీయ మహిళా బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైన సంగతి తెలిసిందే.
ఈ బ్యాంక్ ల ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే వెంటనే తమ వద్ద ఉన్న చెక్ బుక్ లను మార్చుకోవాలని, ఐఎఫ్ఎస్సీ కోడ్లను తెలుసుకోవాలని ఎస్బీఐ తన ఖాతాదారులకు గతంలోనే సూచించింది.
వాస్తవానికి పాత్ చెక్ బుక్లను మార్చుకునేందుకు గతంలో సెప్టెంబర్ 30వ తేదీని ఎస్బీఐ గడువుగా నిర్ధారించింది. ఆ తర్వాత గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఇప్పుడు ఈ గడువు కూడా సమీపిస్తుండడంతో తాజాగా ఆ ఆరు బ్యాంకుల ఖాతాదారులకు మరోసారి సూచన చేసింది.
కొత్త చెక్ బుక్ లను పొందడానికి, ఐఎఫ్ఎస్సీ కోడ్లు తెలుసుకోవడానికి సమీపంలోని ఎస్బీఐ శాఖలను సంప్రదించవచ్చని, లేకపోతే ఏటీఎం, ఎస్బీఐ మొబైల్ యాప్ ద్వారానైనా వీటిని పొందవచ్చని ప్రకటించింది.