కరోనాతో క్రికెటర్, మాజీ క్రీడా మంత్రి చేతన్ చౌహాన్ మృతి
న్యూఢిల్లీ: కరోనా బారినపడి టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మాజీ కేంద్రమంత్రి చేతన్ చౌహాన్(73) కన్నుమూశారు. శరీరంలో కొన్ని అవయవాలు విఫలం కావడంతో ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. కరోనా సోకడంతో జులై 12న ఆయన లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు.

కరోనా తోడవడంతో..
కొన్నేళ్లుగా ఆయన పలు వ్యాధులతో బాధపడుతున్నారు. వృద్ధ్యాప్యం, అనారోగ్యం సమస్యలకు తోడుగా కరోనావైరస్ సోకడంతో చేతన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో గురుగ్రాంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మూత్రపిండాలు వైఫల్యం చెందడంతో శనివారం ప్రాణవాయువు సాయంతో ఆయనకు చికిత్స అందించారు. 1947, జులై 21న జన్మించారు. ఆయనకు భార్య, కుమారుడు వినాయక్ ఉన్నారు. చేతన్ చౌహాన్ కరోనాపై చివరి వరకు పోరాడి మరణించారని ఆయన సోదరుడు పుష్పేంద్ర చౌహాన్ తెలిపారు. చేతన్ కుమారుడు వచ్చిన తర్వాత ఆయన అంత్యక్రియలు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

టీమిండియా ఓపెనర్గా.. క్రీడారంగంలో సేవలు
చేతన్ చౌహాన్ టీమిండియా ఓపెనర్గా అందరికి సుపరిచతమే. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్కు సుదీర్ఘకాలం ఓపెనింగ్ భాగస్వామిగా చేతన్ ఉన్నారు. 40 టెస్టులు ఆడారు. మహారాష్ట్ర, ఢిల్లీ తరపున రంజీల్లో ఆయన ఆడారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవుల్లో కొనసాగారు. ఢిల్లీ ప్రధాన సెలక్టర్గా సేవలు అందించారు. కాగా, ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఆయన భారత జట్టు మేనేజర్గా కూడా పనిచేశారు. నిఫ్ట్ ఛైర్మన్గానూ ఆయన పనిచేశారు.

క్రికెట్లోనే కాదు.. క్రీడామంత్రిగానూ సేవలు
మరోవైపు రాజకీయాల్లో కూడా ప్రవేశించి రాణించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా నుంచి 1991, 1998లో లోక్సభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషించారు. 2018, ఆగస్టు వరకు ఉత్తరప్రదేశ్ క్రీడా మంత్రిగా పనిచేయడం గమనార్హం. చేతన్ మృతి పట్ల రాజకీయ, క్రీడా ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్రీడా, రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేమని గుర్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications