కుప్పకూలిన ప్రభుత్వ హెలికాప్టర్: ఇద్దరు పైలట్లు మృతి, ముఖ్యమంత్రి సంతాపం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. రాయ్పూర్లోని విమానాశ్రయంలో గురువారం రాష్ట్ర హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. నివేదికల ప్రకారం.. పైలట్లు హెలికాప్టర్ను ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న పైలట్లు ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. తన సంతాపాన్ని వ్యక్తం చేశారు సీఎం భూపేశ్ బఘేల్. "రాయ్పూర్లోని విమానాశ్రయంలో రాష్ట్ర హెలికాప్టర్ కూలిపోవడం గురించి ఇప్పుడే ఒక విచారకరమైన వార్త వచ్చింది. ఈ విషాద ప్రమాదంలో, మా పైలట్లు కెప్టెన్ పాండా, కెప్టెన్ శ్రీవాస్తవ ఇద్దరూ మరణించారు. ఈ దుఃఖ సమయంలో భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.
వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం.. రాయ్పూర్లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో ఫ్లయింగ్ ప్రాక్టీస్ సందర్భంగా ఈ సంఘటన రాత్రి 9:10 గంటల సమయంలో జరిగిందని, ఈ ఘటన మానా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.
ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలయ్యారు. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వారు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని ఎస్ఎస్సీ తెలిపారు.