ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: గణతంత్ర దినోత్సవం వేళ..ఊహించని గిఫ్ట్
రాయ్పూర్: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం పోరాడుతున్నారు. జగన్ సర్కార్ వారికి ఇదివరకే పెంచిన కొత్త పీఆర్సీతో కూడిన వేతనాన్ని తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలను చెల్లించేలా ప్రభుత్వం జీవోలను జారీ చేయడం, దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గం ఆమోదించడం చకచకా సాగిపోయాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులను బుజ్జగించడానికి ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు సాగిస్తోంది.
ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే- ఛత్తీస్గఢ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. దేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటోన్న వేళ.. ఉద్యోగులకు ఊహించిన బహుమతిని ఇచ్చింది. అదే- వారంలో అయిదు రోజుల పని. ఇకపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ఉద్యోగులు వారంలో అయిదు రోజుల పాటు మాత్రమే పని చేస్తారు. రెండు రోజుల పాటు సెలవు ఉంటుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. అవి తక్షణమే అమల్లోకి వస్తాయనీ ప్రకటించింది.
అదే సమయంలో- పింఛన్దారులకు కూడా తీపికబురు వినిపించింది. ప్రభుత్వ కంట్రిబ్యూషన్ను పెంచింది. నాలుగు శాతం మేర అదనపు పింఛన్ కంట్రిబ్యూషన్ను విడుదల చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో పింఛన్దారులకు 10 శాతం మేర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ అందుతోంది. దీనికోసం అన్ష్యదారి పింఛన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇకపై ఈ పథకం కింద కంట్రిబ్యూషన్ మొత్తాన్ని 14 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది.
భవన నిర్మాణాలు సహా అసంఘటిత కార్మికరంగంలో ఉన్న వారిని సంఘటిత కార్మిక రంగ కార్మికులుగా గుర్తిస్తామని, దీనికోసం ఈ సంవత్సరంలోనే ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రకటించారు. మహిళలకు సమగ్రమైన రక్షణ కల్పించడానికి ప్రతి జిల్లాలోనూ మహిళా సురక్షా బృందాలను ఏర్పాటు చేస్తామని, దీనికోసం అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నామని తెలిపారు.
లెర్నింగ్ లైసెన్సులను జారీ చేయడాన్ని మరింత సరళీకరించబోతున్నామని, దీనికోసం డ్రైవింగ్ టెస్టులు, కేంద్రాల సంఖ్యను పెంచుతామని అన్నారు. దీనివల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని చెప్పారు. కొత్త నియామకాలను చేపట్టబోతున్నామని తెలిపారు. 2022-23 ఖరీఫ్ సీజన్లో కొన్ని రకాల పప్పు దినుసులకు ఇచ్చే కనీస మద్దతు ధరను పెంచుతున్నామని పేర్కొన్నారు. పారిశ్రామిక విధానంలో భాగంగా కొత్తగా పరిశ్రమలను నెలకొల్పబోయే వెనుకబడిన తరగతుల వారికి 10 శాతం ప్లాట్లను రిజర్వ్ చేస్తున్నట్లు చెప్పారు.