మనీలాండరింగ్ కేసు: ఆ రాష్ట్ర సీఎం డిప్యూటీ సెక్రటరీని అరెస్ట్ చేసిన ఈడీ
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో జరిగిన బొగ్గు లెవీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
ఛత్తీస్గఢ్లో శక్తివంతమైన బ్యూరోక్రాట్ గా పేరున్న చౌరాసియాను ఈడీ అధికారులు ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అరెస్ట్ చేసిన తర్వాత సీఆర్పీఎఫ్ సిబ్బంది భద్రతతో ఈడీ అధికారులు ఆమెను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చారు.
ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఆమెను నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీకి పంపింది. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అజయ్ సింగ్ రాజ్పుత్ ముందు ఏజెన్సీ 14 రోజుల కస్టడీని కోరింది.
ఈ అరెస్టు పరిణామంపై భూపేష్ బఘెల్ స్పందిస్తూ.. "రాజకీయ చర్య" అని అన్నారు. "నా డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేయడం రాజకీయ చర్య. దీనికి వ్యతిరేకంగా మేము మా శక్తితో పోరాడుతాము" అని బఘేల్ ట్వీట్ చేశారు.
రాయ్పూర్లో 2021, జూన్ నెలలో నిర్వహించిన ఐటీ దాడుల్లో సుమారు రూ. 100 కోట్లకుపైగా హవాలా రాకెట్ బయటపడింది. హవాలా లావాదేవీల కింద అధికారిక బ్యాంకింగ్ ఖాతాలోకి ప్రవేశించకుండా నగదు చేతులు మారినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆదాయపుపన్ను శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు విచారణను ఈడీ చేపట్టింది.
ఛత్తీస్గఢ్లో సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మధ్యవర్తులతో కూడిన కార్టెల్ రవాణా చేసే ప్రతి టన్ను బొగ్గు నుంచి టన్నుకు 25 రూపాయల అక్రమ లెవీ వసూలు చేస్తున్నారని ఈడీ ఆరోపించింది.
అక్టోబర్లో ఛత్తీస్గఢ్లో వరుసగా రెండు రోజుల పాటు ఈడీ దాడులు నిర్వహించి సుమారు రూ.4 కోట్లను స్వాధీనం చేసుకుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారుల నివాసాల్లోనూ ఈడీ బృందం సోదాలు చేసింది. రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి సమీర్ విష్ణోయ్తో పాటు మరో ఇద్దరిని ఏజెన్సీ అరెస్టు చేసింది.