అమానవీయం : చెత్త వ్యానులో కోవిడ్ పేషెంట్ల మృతదేహాల తరలింపు...
కోవిడ్ మృతుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న ఘటన ఛత్తీస్గఢ్లో వెలుగుచూసింది. మృతదేహాలను చెత్త వ్యానులో తరలిస్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. రాజ్నందగావ్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రాజ్నందగావ్లో కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను నలుగురు పారిశుద్ధ్య కార్మికులు చెత్త వ్యానులోకి ఎక్కిస్తున్న వీడియో వెలుగుచూసింది. పూర్తిగా పీపీఈ కిట్లు ధరించి ఉన్న ఆ నలుగురు పారిశుద్ధ్య కార్మికులు.. చెత్త వ్యానులో మృతదేహాలను శ్మశానికి తరలిస్తున్నారు. మృతదేహాలను మున్సిపాలిటీ చెత్త వ్యానులో తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనపై స్థానిక చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ...'మృతదేహాల తరలింపుకు వాహనాన్ని సమకూర్చడం నగర్ పంచాయతీ,సీఎంవోల పని...' అని పేర్కొన్నారు. కాబట్టి మృతదేహాల తరలింపుతో తమకు సంబంధం లేదన్నారు.
గతేడాది కరోనా కేసులు పీక్స్కి చేరిన దశలో దేశంలోని పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మృతదేహాలను కొన్నిచోట్ల జేసీబీల్లో తరలించిన ఘటనలు వెలుగుచూశాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఛత్తీస్గఢ్లో ఇప్పటికే ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. చాలాచోట్ల పేషెంట్లకు బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో ఇప్పటికే ఐసీయూ,ఆక్సిజన్తో కూడిన బెడ్లు 100శాతం నిండిపోయాయి. కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండటంతో మృతదేహాలను భద్రపరిచేందుకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.ఎక్కువ సంఖ్యలో ఫ్రీజర్స్ అందుబాటులో లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ మృతదేహాలను వదిలేస్తున్నారు.
రాజ్నందగావ్ విషయానికి వస్తే.. ఇక్కడి ఆస్పత్రులన్నీ కోవిడ్ పేషెంట్లతో నిండిపోవడంతో ప్రెస్ క్లబ్ను సైతం కోవిడ్ సెంటర్గా మార్చేశారు. దాదాపు 30 పడకలు ఏర్పాటు చేసి అసింప్టమాటిక్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఓ మెడికల్ టీమ్ను ఏర్పాటు చేశారు. వారు నిరంతరం ఇక్కడి పేషెంట్ల బాగోగులను పర్యవేక్షిస్తున్నారు.అయితే కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే ఇప్పుడున్న హెల్త్ కేర్ వ్యవస్థ తట్టుకోలేదన్న వాదన వినిపిస్తోంది.
ఛత్తీస్గఢ్లో బుధవారం(ఏప్రిల్ 14) 14,250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 120 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,86,244కి చేరగా.. మొత్తం మృతుల సంఖ్య 5307కి చేరింది.