కానిస్టేబుల్ కామం.. టీవీ సౌండ్.. కట్ చేస్తే కుటుంబం బలి!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఎంతటి ఘోరానికి దారితీస్తుందో ఈ ఉదంతం నిరూపించింది. ఓ కానిస్టేబుల్ ప్రియురాలు ఆవేశంతో ఊగిపోయి.. అతని భార్య, కుమారుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. ఈ రక్తపాతం దుర్గ్ జిల్లాలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే?
ఛత్తీస్గఢ్కు చెందిన కానిస్టేబుల్ లలితేష్ యాదవ్ తన భార్య రీనా యాదవ్, ముగ్గురు పిల్లలతో కలిసి దుర్గ్లోని ఓ ఫ్లాట్లో నివసిస్తున్నారు. లలితేష్కు సరోజిని భరద్వాజ్ (25) అనే యువతితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం లలితేష్ తన కుటుంబం ఊరికి వెళ్లడం కోసం రైల్వే టిక్కెట్లు కొనడానికి స్టేషన్కు వెళ్లారు. ఆయన ఇంట్లో లేని సమయం చూసి సరోజిని నేరుగా వారి ఫ్లాట్లోకి చొరబడింది.

ప్రణాళికాబద్ధంగా దాడి
నిందితురాలు సరోజిని తొలుత లలితేష్ భార్య రీనాతో గొడవకు దిగింది. ఆ గొడవ బయట ఎవరికీ వినిపించకుండా ఉండేందుకు ఆమె ఇంట్లోని టీవీ సౌండ్ను భారీగా పెంచేసింది. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో రీనాపై విచక్షణారహితంగా దాడి చేసింది. అంతటితో ఆగకుండా నిద్రపోతున్న తొమ్మిదేళ్ల కుమారుడు ఆదిత్యను కూడా దారుణంగా పొడిచింది. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు కుమార్తెలు నైనా, తనియాలపై కూడా దాడికి యత్నించింది.
పిల్లల కోసం తల్లి పోరాటం
తీవ్రంగా గాయపడిన రీనా యాదవ్.. తన పిల్లలను వదిలేయమని నిందితురాలిని వేడుకుంది. తన ప్రాణాలు పోతున్నా సరే.. నిందితురాలి కాళ్లు పట్టుకుని పిల్లలను పారిపోమని చెప్పింది. దీంతో ఓ కుమార్తె బాత్రూమ్లో దాక్కుంది, మరో కుమార్తె బయటకు పరుగెత్తి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని, రక్తంతో తడిచిన కత్తితో ఉన్న సరోజినిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఆసుపత్రిలో విషాదం
గాయపడిన వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే రీనా యాదవ్, ఆమె కుమారుడు ఆదిత్య మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మిగిలిన ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
నిందితురాలి అరెస్ట్
ప్రాథమిక విచారణలో లలితేష్ యాదవ్, సరోజిని మధ్య కొంతకాలంగా సంబంధం ఉన్నట్లు తేలింది. శుక్రవారం కూడా ఆమె లలితేష్ ఇంటికి రాగా.. ఆయన ఆమెను పంపించివేశారు. కానీ శనివారం ఆయన లేని సమయంలో ఈ ఘోరానికి ఒడిగట్టింది. భిలాయ్ సీఎస్పీ సత్యప్రకాష్ తివారీ మాట్లాడుతూ.. నిందితురాలిని అరెస్ట్ చేశామని, ఈ దాడి ముందే ప్లాన్ చేసిందా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.












Click it and Unblock the Notifications