ప్రత్యేక సెల్, వెస్ట్రన్ టాయ్లెట్ సదుపాయం కల్పించాలని కోర్టును కోరిన చిదంబరం
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు సెప్టెంబర్ 19వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను తీహార్ జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలివ్వడం జరిగింది. ఇదిలా ఉంటే తీహారు జైలులో చిదంబరం ఉండేందుకు తనకు కొన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఓ అప్లికేషన్ను ఆయన తరపున లాయర్లు కోర్టుకు సమర్పించారు. చిదంబరం వయస్సు దృష్ట్యా ఆయన నేలపై కూర్చోలేరని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు ఆయనకు వెస్ట్రన్ టాయ్లెట్ సదుపాయం కల్పించాలని అందులో పేర్కొన్నారు.
ఇక జైలులో ఉన్న సమయంలో తనకు అదనపు భద్రత కల్పించాలని ఆయనకు జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సాధారణంగా జైలు నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయరని... అయితే చిదంబరంకు జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ ఉన్న దృష్ట్యా తనకు ప్రత్యేక జైలుగది కేటాయించాలని కపిల్ సిబాల్ న్యాయస్థానాన్ని కోరారు. చిదంబరంకు అదనపు భద్రత ఇచ్చేందుకు తమకు సమ్మతమే అని సాల్సిటర్ జనరల్ చెప్పారు. ఈమేరకు భరోసా కూడా కల్పించారు.

ఇప్పటి వరకు అంటే ఆగష్టు 21న చిదంబరం అరెస్టు అయినప్పటినుంచీ ఐదుసార్లు ఆయన్ను సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు. మొత్తం 15 రోజుల పాటు సీబీఐ కస్టడీలో చిదంబరం ఉన్నారు. ఇక గురువారం కోర్టులో హాజరుపర్చగానే సీబీఐ తన వాదనలను వినిపించింది. చిదంబరం పలుకుబడి ఉన్న వ్యక్తి కనుక సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని అందుకే ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోరింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన ప్రత్యేక జడ్జి అజయ్ కుమార్ చిదంబరంకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ అంతవరకు తీహార్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications