జనవరి ఎపిసోడ్లో ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా జడ్జీలతో చర్చించి ఉంటే బాగుండేది: ఫాలీ నారిమన్
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై నిప్పులు చెరిగారు. ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు పాలనా వ్యవహారాన్ని తప్పుబడుతూ ఇందుకు కారణం ఛీఫ్ జస్టిస్ అంటూ జస్టిస్ జాస్తి చలమేశ్వర్తో పాటు మరో ముగ్గురు జడ్జీలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయితే ఈ నలుగురు జడ్జీలతో దీపక్ మిశ్రా మాట్లాడి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం నారిమన్ వ్యక్తం చేశారు. నలుగురు జడ్జీలతో కూర్చని సమస్యను పరిష్కరిస్తారని తాను భావించినట్లు నారిమన్ చెప్పారు.
గాడ్ సేవ్ ది హానరబుల్ సుప్రీం కోర్టు పేరుతో ఫాలి నారిమన్ రాసిన పుస్తకం త్వరలో విడుదల కానుంది. ఈ పుస్తకంలో సుప్రీం కోర్టులో జరుగుతున్న అన్ని వివాదాలు, పాలనాపరంగా జరుగుతున్న వ్యవహారాలన్నిటినీ ఈ పుస్తకంలో రాసినట్లు నారిమన్ వెల్లడించారు. సుప్రీం కోర్టు జడ్జీలు మీడియాకు ఎక్కడమే ఈ పుస్తకం రాసేందుకు ప్రేరణ ఇచ్చిందా అన్న ప్రశ్నకు... నారిమన్ అవుననే సమాధానం చెప్పారు. ఈ వివాదం ప్రజల్లో ఎన్నో ప్రశ్నలు, డౌట్లు తలెత్తేలా చేసిందని చెప్పారు. నలుగురు జడ్జీలు ఒక రకమైన వాదనలు వినిపిస్తే... సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ మరో వాదన వినిపిస్తారు. ఇక మిగతా జడ్జీలు ఏమీ మాట్లాడరు. ఇలాంటప్పుడు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని చెప్పారు.
ఎమ్సీఐ స్కామ్లో గతేడాది నవంబర్లో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఇచ్చిన తీర్పు నుంచే ఈ వివాదం రాజుకుందని నారిమన్ తెలిపారు. అయితే సుప్రీం కోర్టు పాలనా వ్యవహారాలను ప్రజల దృష్టిలో జస్టిస్ దీపక్ మిశ్రా పరిరక్షిస్తున్నారా అన్న ప్రశ్నకు... నారిమన్ పరిరక్షించకపోయి ఉండొచ్చు అనే సమాధానం ఇచ్చారు. అంతేకాదు ఇతర జడ్జీలతో సమావేశమై తదుపరి కార్యాచరణ ఏమిటి అన్నది చర్చించి ఉంటే బాగుండేదని నారిమన్ అన్నారు. ఒక బాధ్యతగల పదవిలో ఉన్నప్పుడు ఇంత వ్యవహారం జరిగాక కూడా చర్చించలేదంటే తప్పుడు సంకేతాలు వెళతాయని నారిమన్ వివరించారు. ప్రతి ప్రధాన న్యాయమూర్తి ఇతర జడ్జీలతో సమావేశమై సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. సుప్రీం కోర్టులో ఇలాంటి వాతావరణం కనిపించడం లేదన్నారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తానే అంతా అనేలా ఉండకూడదని నారిమన్ తెలిపారు.
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ నియమితులవుతారా... అన్న ప్రశ్నకు.. కేవలం ప్రెస్ మీట్ పెట్టి తాను కొన్ని నిజాలను బయటపెట్టినంత మాత్రానా జస్టిస్ రంజన్ గొగోయ్ అర్హత కోల్పోరు అని చెప్పారు. జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం ముగిశాక జస్టిస్ రంజన్ గొగోయ్కే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అదే తన అభిప్రాయం కూడా అని నారిమన్ చెప్పారు. ఇది రాజ్యాంగబద్ధంగా జరిగే నియామకం కనుక అందరూ నియామకాన్ని గౌరవించాలన్నారు.
చివరిగా తను ఈ పుస్తకం రాసేది సుప్రీంకోర్టులో చెలరేగిన వివాదంపై అగ్గి రాజేసేందుకు కాదని... ఈ సమస్య సద్దుమణిగేలా చేసేందుకే అని స్పష్టం చేశారు. తను ప్రత్యేకించి ఏ జడ్జీని ఉద్దేశించి పుస్తకం రాయలేదని... సుప్రీం కోర్టు వ్యవస్థ అందులోని ప్రధాన న్యాయమూర్తి పాత్రను ప్రస్తావిస్తూ పుస్తకం రాసినట్లు వివరించారు.